‘లయన్స్’ను గెలిపించిన ‘కింగ్స్’ ఫీల్డర్లు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ – గుజరాత్ లయన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు సండే వినోదాన్ని అందించడంలో సక్సెస్ సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓటమి పాలయిన పంజాబ్ జట్టు, ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది. ఇంకా చేతిలో మూడు మ్యాచ్ లు మిగిలి ఉండగా, మూడు మ్యాచ్ లలోనూ తప్పక విజయం సాధించాల్సి ఉండగా, అయినా కూడా ఇతర మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

మరోవైపు ఈ టోర్నీ నుండి ఇప్పటికే వైదొలగిన లయన్స్ జట్టు మాత్రం, వెళ్తా వెళ్తా కింగ్స్ ను కూడా పట్టుకుపోయే విధంగా ప్రదర్శన ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. ఈ సీజన్ ఐపీఎల్ లో ఇప్పటికే ఒక సెంచరీ నమోదు చేసిన హాషిమ్ ఆమ్లా మరోసారి చెలరేగి, 60 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 పరుగులు చేసి పంజాబ్ భారీ స్కోర్ కు ప్రధాన కారణమయ్యాడు. మరో ఎండ్ లో షాన్ మార్ష్ 58 పరుగులతో చక్కని సహకారం అందించాడు.

ఇక లక్ష్య చేధనలో గుజరాత్ లయన్స్ జట్టుకు ఏ మాత్రం తడబాటుకు గురి కాకుండా చూసుకోవడంలో కింగ్స్ ఫీల్డర్లు విజయవంతం అయ్యారు. ఓపెనర్ డ్వేన్ స్మిత్ ఇచ్చిన తేలికపాటి క్యాచ్ లను అందుకోవడంలో కింగ్స్ ఫీల్డర్లు విఫలం కావడంతో, అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. దీంతో 39 బంతుల్లో 74 పరుగులు చేసి గుజరాత్ విజయానికి పునాది వేసాడు స్మిత్. ఆ తర్వాత కార్యక్రమాలను సురేష్ రైనా (39), దినేష్ కార్తీక్ (35) పరుగులతో పూర్తి చేసారు. చివర్లో రైనా ఔటైన తర్వాత కాస్త ఒత్తిడికి గురైనప్పటికీ, పంజాబ్ ఫీల్డర్లు ఇచ్చిన సహకారంతో దినేష్ కార్తీక్ గుజరాత్ ను విజయం వైపు నిలబెట్టాడు.

పేలవమైన ఫీల్డింగ్ మరియు బౌలింగ్ ప్రదర్శనతో భారీ స్కోర్ ను నిలుపుకోవడంలో పంజాబ్ జట్టు మరోసారి పూర్తిగా విఫలమైంది. ఇంతకు ముందు హాషిమ్ ఆమ్లా ముంబై ఇండియన్స్ పైన సెంచరీ చేసిన సమయంలో కూడా పంజాబ్ ఓటమి పాలు కావడం విశేషం. అయితే చేతిలో ఉన్న మూడు మ్యాచ్ లకు ఆమ్లా దూరం కానుండడంతో బ్యాటింగ్ విభాగంలో పంజాబ్ కు భారీ కొరత ఏర్పడనుంది. సోమవారం నాడు అత్యంత కీలకమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.

ADVERTISEMENT
Latest Stories