ఐపీఎల్ సీజన్ 10 చివరి దశకు వచ్చేసింది. క్రికెట్ అభిమానుల కోసం ఇంకా ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది. అదే ఆదివారం నాడు జరగబోయే ఫైనల్. అయితే ఈ ఫైనల్లో స్థానం కోసం బెంగుళూరు వేదికగా ముంబై ఇండియన్స్ – కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడగా, ముంబై అలవోకగా జయకేతనం ఎగుర వేయడంతో వీక్షకులకు కావల్సినంత ‘కిక్’ అయితే లభించలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై, తొలి ఓవర్ నుండి కట్టుదిట్టమైన బౌలింగ్ తో నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ ను నిలువరించారు.
రెండవ ఓవర్ లో బూమ్రా బంతికి బోల్తా పడిన క్రిస్ లయన్ తో కోల్ కతా ఇన్నింగ్స్ పతనం ప్రారంభమైంది. అప్పటి నుండి ఏ దశలోనూ కోలుకునే దిశగా ఇన్నింగ్స్ సాగకపోవడంతో, మ్యాచ్ ముంబై వశం అవుతుందన్నది దాదాపుగా ఖరారైపోయింది. బూమ్రా అద్భుతమైన ఓవర్లకు తోడు స్పిన్నర్ కరణ్ శర్మ సూపర్ డెలివరీస్ తో కోల్ కతా బ్యాట్స్ మెన్లు పెవిలియన్ వైపుకు చూడడంతో, కేవలం 107 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. బూమ్రా 3 వికెట్లు తీయగా, కరణ్ శర్మ 4 వికెట్లతో కోల్ కతాను మట్టి కరిపించారు.
ఇక స్వల్ప లక్ష్య చేధనలో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నట్లు అనిపించిన ముంబైను కెప్టెన్ రోహిత్ శర్మ (26), కృనాల్ పాండ్య (45 నాటౌట్) ఆదుకున్నారు. కోల్ కతాకు మరో అవకాశం ఇవ్వకుండా 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకునేలా బ్యాటింగ్ చేసారు. రోహిత్ శర్మ చివర్లో అవుటైనప్పటికీ, పొల్లార్డ్ అండతో కృనాల్ మ్యాచ్ ను విజయవంతంగా ముగించాడు. దీంతో ఆదివారం నాడు పూణేతో జరగబోయే ఫైనల్లో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ సీజన్ లో ఇప్పటివరకు మూడు సార్లు పూణే – ముంబై తలపడగా, మూడు సార్లు పూణేదే ఆధిపత్యం కావడంతో, ఈ సారి ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవడంతో పాటు, సీజన్ 10 ఐపీఎల్ సిరీస్ ను దక్కించుకోవాలనే ఆరాటంలో ముంబై ఇండియన్స్ ఉంది. అలాగే ఒక్కసారైనా ఐపీఎల్ కప్ ను అందుకోవాలనే ఆకాంక్షతో స్మిత్ సారధ్యంలోని పూణే జట్టు ఉంది. ఆ జట్టులో ధోని ఉండడం ప్రధాన ప్లస్ పాయింట్ గా మారింది. మరి ఫైనల్ కిక్ కోసం హైదరాబాద్ లోని ప్రేక్షకులు నిరీక్షిస్తున్నారు.



