తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత వర్గ పోరు నానాటికి సీఎం రేవంత్ కు తలపోటుగా మారుతుంది. ఒక పక్క కొండా సురేఖ వివాదం మరో పక్క పార్టీలోని ఒక వర్గం నేతలు రేవంత్ టార్గెట్ చేస్తున్న అంతర్గత రాజకీయం కి తోడు రేవంత్ చెవిలో జోరిగిలా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రకటనలు…ఇలా ఎటు చూసిన రేవంత్ కి ఇంటి పోరు తప్పడం లేదు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేందుకు చేయూతనివ్వని ఈ సోకాల్డ్ రాజకీయ నాయకుల సీనియారిటీ, ఇప్పుడు రేవంత్ ని ఎదిరించడానికి, రేవంత్ టార్గెట్ గా రాజకీయం నడిపించడానికి ప్రయోగిస్తున్నారా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గ పోరు ఊపందుకుంది.
ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రేవంత్ ని ఇబ్బంది పెడుతూనే ఉంది. నేడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ కొత్తగా కాంగ్రెస్ లోకి వచ్చిన కొందరు పార్టీని కబ్జా చేసి అధికారం చెలాయిద్దామని చూస్తున్నారని, తానూ ఉన్నంతవరకు అది అసాధ్యమంటూ పరోక్షంగా రేవంత్ ను టార్గెట్ చేసారు.
అలాగే తానూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన శిష్యుడనని, ఆయన స్ఫూర్తి తోనే రాజకీయాలలోకి వచ్చానని కాంగ్రెస్ ప్రభుత్వంలో సీమాంధ్రనేతలు పెత్తనం ఎక్కువయిందని, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు కాంగ్రెస్ లో పదవులు అనుభవిస్తున్నారంటూ రేవంత్ పై తన అక్కసు మరోసారి వెళ్లగక్కారు.
ఇక ఆ కార్యక్రమంలో రాజగోపాల్ అనుచరులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతో ఆ సమయం వస్తే దాన్ని బ్రహ్మ దేవుడు కూడా తనకు సీఎం కాకకుండా అడ్డుకోలేరంటూ తన పదవి కాంక్షను బయటపెట్టారు.
అయితే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడని వీరి రాజకీయం ఇలా పార్టీలో అంతర్గత పోరాటాలకు మాత్రం ఉపయోగపడుతుందా.? ఇటువంటి వారిని పార్టీలో పెట్టుకుంటే రేవంత్ ఎప్పటికి అంతర్గత యుద్ధం చెయ్యాల్సిందే.





