ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే చెప్పాలి. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్, తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇద్దరు కూడా తమ పార్టీ ఓటమి తరువాత చట్ట సభలకు హాజరయ్యిందే లేదు.
పార్టీ ఓడినా పులివెందుల ఎమ్మెల్యేగా జగన్, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఇద్దరు కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి తమ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రజావ్యతిరేక ప్రభుత్వం నిర్ణయాల పై ప్రభుత్వ పెద్దలను నిలదీసేందుకు చట్టసభలకు హాజరుకావాల్సి ఉంది, ప్రజాసమస్యల పై పోరాడాల్సి ఉంది.
కానీ ఒకరేమో తనకు ప్రజలివ్వని ప్రతిపక్ష నేత హోదా ప్రభుత్వం ఇస్తేనే అసెంబ్లీ వస్తానంటూ మారం చేస్తూ బెంగళూర్ టూ తాడేపల్లి పర్యటనలు చేస్తూ కళ్ళు మూసుకుని కాలం గడిపిస్తుంటే, మరొకరేమో ముఖ్యమంత్రి గానే తిరిగి అసెంబ్లీ లో అడుగుపెట్టాలని ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు.
అయితే వీరిద్దరూ తమ తమ కారణాలతో చట్టసభలకు హాజరుకాకపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చే రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను మాత్రం వదులుకోవడం లేదు. ఎమ్మెల్యే గా ప్రతిపక్ష నేతగా తమ తమ డ్యూటీ చేసి ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటే ఇక్కడ సమస్య లేదు. కానీ ఇటు జగన్ కానీ అటు కేసీఆర్ కానీ అసెంబ్లీ రాకపోయినా తమ జీతాలను మాత్రం వదులుకోవడం లేదు.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ కి రాలేని వారు రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే బాగుంటుందంటూ, అసెంబ్లీ కి రాకపోయినా లక్షలలో జీతాలు తీసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యడం ఎందుకు అంటూ వ్యాఖ్యానించగా అందుకు కేటీఆర్ నేడు కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ కి రాజకీయాలలో రాజీనామాలు కొత్తమే కాదని, కేసీఆర్ గతంలో రాజీనామా చేస్తే ఢిల్లీ నే వణికిందని, సాక్ష్యాత్తు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నే కేసీఆర్ రాజీనామా కి భయపడి ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేసిందని, కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకునే శక్తి మీ నాయకురాలికే లేదు, మరి నీకుందా.? అంటూ రేవంత్ కేంద్రంగా విమర్శలు మొదలుపెట్టారు.
అలాగే రేవంత్ కోరిక ప్రకారమే కేసీఆర్ తిరిగి అసెంబ్లీ వస్తారని, కానీ అది తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలోనే అంటూ రాబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఇకరారు అనేది చెప్పకనే చెప్పారు కేటీఆర్. అయితే కేవలం అధికారం చేతిలో ఉంటేనే, ముఖ్యమంత్రి పదవి ఉంటేనే అసెంబ్లీ కి వెళ్లాలని, వెళ్తారని చెప్పడం, దాన్ని సమర్థిస్తూ ప్రకటనలు చేయడం ప్రజాస్వామ్యంలో సహేతుకమా అనేది రాజకీయ నేతలు ఒక్కసారి పునరాలోచన చెయ్యాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇలా అయితే రేపటి రోజున బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే పరిస్థితి ఉంటుందా.? వైసీపీ ప్రభుతావన్ని ఏర్పాటు చేస్తే టీడీపీ, జనసేన చట్టసభలలో అడుగు పెట్టె అవకాశం ఉంటుందా.? నేడు అసెంబ్లీ కి వెళ్లకపోవడాన్ని సమర్ధించుకుంటున్న ఈ సోకాల్డ్ నేతలు రేపటి రోజున తాము అధికారంలోకి వస్తే ప్రత్యర్థులను ప్రశ్నించే అర్హతను వదులుకున్నట్టేగా..!
ఇలా అయితే ఇక రానున్న రోజులలో తెలుగు రాష్ట్ర రాజకీయాలలో అసెంబ్లీ సమావేశాలు కేవలం అధికార పార్టీ నేతల రాజకీయ ప్రకటనలకే పరిమితం కానుందా.? ప్రతిపక్షంలో ఉన్నవారు పోరాట యాత్రలు, పాదయాత్రలు అంటూ కాలం గడిపేయడమేనా.?





