తెలంగాణ అధికార పార్టీ లో కొండా సురేఖ వివాదం ఆరని చిచ్చు మాదిరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. స్వయంగా సీఎం రేవంత్ పైనే కొండా కుమార్తె సుస్మిత అవినీతి ఆరోపణలు చేసినా వాటికీ మాకు సంబంధం లేదంటూ సురేఖ వినిపిస్తున్న వాదన కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం సంతృప్తి పరచడం లేదనే సమాచారం.
అయినా కూడా సురేఖ ఇప్పటికి అదే స్టాండ్ మీద ఉంటూ తన స్వరాన్ని మరింత బిగ్గరగా వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీ పెద్దలతో భేటీ తరువాత సురేఖ స్వరం అభ్యర్ధనల నుంచి హెచ్చరికల వరకు వెళ్ళింది. తమకు గాంధీ కుటుంబం అంటే గౌరవం, విశ్వాసం ఉందంటూనే తన పై చర్యలకు పాల్పడితే బీసీ ల నుంచి వ్యతిరేకత తప్పదంటూ హెచ్చరిస్తున్నారు సురేఖ.
తన కుమార్తె తప్పు చేస్తే శిక్ష తనకు విధిస్తారా అంటూ ఒకపక్క అభ్యర్ధన చేస్తూనే మరోపక్క తన పై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ పై కూడా చర్యలు తీసుకోవాలని, బీసీ నేత అయిన తనకో న్యాయం ఇతర వర్గాల నేతలకు మరో న్యాయమా.? అంటూ తన పై చర్యలు తీసుకుంటే రాష్ట్రంలోని బీసీలంతా ఏకమవుతారంటూ అధిష్టానికి కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు కొండా.
పదేళ్ల పాటు తానే సీఎం అంటూ రేవంత్ చేస్తున్న ప్రకటనల పై పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యే లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనకు మంత్రి పదవి నుంచి తప్పించడం అంటే అది బీసీలకు చేసిన అన్యాయమే అవుతుందంటూ సురేఖ కులం కార్డు ప్రయోగించారు.
అలాగే మా కంటే ముందు మాట్లాడిన రెడ్డి నేతల పై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారంటూ ప్రశ్నిస్తూనే పలువురు మంత్రులు పై అనేక ఆరోపణలు ఉన్నాయని, ఇక మంత్రి పొంగులేటి, భట్టి భార్యల కమిషన్ల పైన ఫిర్యాదులొచ్చాయని, వాటికి ఏం సమాధానం చెపుతారంటూ సురేఖ పార్టీ పై ఎదురుదాడి మొదలుపెట్టారు.
తానూ పద్మశాలి, తన భర్త మున్నూరు కాపు నా పై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ కి మా రెండు సామాజికవర్గాల ఓట్లు దూరమవ్వడం ఖాయమంటూ, తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని అటువంటి తనను మంత్రి పదవి నుంచి ఎలా తప్పిస్తారంటూ గంభీర స్వరంతో సురేఖ పార్టీ అధిష్టానానికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి.
మరి అధిష్టానం నిర్ణయమే తుది తీర్పు అంటూ చిలక పలుకులు పలుకుతున్న ఈ సోకాల్డ్ కాంగ్రెస్ నేతలు చివరికి అదే అధిష్టాన నిర్ణయం తమకు వ్యతిరేకంగా వస్తే….ఇక కాంగ్రెస్ లో సంప్రదాయంగా వస్తున్న వర్గ పోరు మరోసారి రచ్చకెక్కడం ఖాయంగా కనపడుతుంది.





