ఇదివరకు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏటా ఏప్రిల్ 27న ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిపేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు ‘గులాబీ కూలీ’ పేరుతో బట్టల దుకాణాలు, ఆసుపత్రులలో పని చేసి పార్టీ సభకు విరాళాలు పోగేసేవారు.
అయితే పేరుకు ‘గులాబీ కూలీ’ అయినా ఓ మంత్రి లేదా ఓ ఎమ్మెల్యే లేదా ఎంపీ వచ్చి మీడియాకు ఫోజులిస్తూ రెండు నిమిషాలు పనిచేసినట్లు నటించినందుకు ఆయా యాజమానుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసేవారు. అధికార పార్టీ నేతలు అడిగినంత ‘కూలి’ ముట్టజెప్పకపోతే ఏమవుతుందో అందరికీ తెలుసు. కనుక ఇష్టం ఉన్నా లేకపోయినా వారు చేసే గులాబీ కూలీ’ చెల్లించక తప్పది కాదు.
గులాబీ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత వంటివారు రోడ్ పక్కన టీ, టిఫిన్, ఫ్రూట్ జ్యూస్, కూరగాయలు అమ్ముకునేవారికి కూడా గులాబీ కూలీ చేశారు!
కేటీఆర్ లేదా హరీష్ రావు ఒక టీ అమ్మితే రూ.400-500, ఒక జ్యూస్ అమ్మితే రూ.500 చొప్పున కొనుక్కొనేందుకు పోటీ పడేవారంటే ‘గులాబీ కూలి’ ఎంత ఖరీదైన వ్యవహారమో అర్దం చేసుకోవచ్చు. గులాబీ కూలి పేరుతో బిఆర్ఎస్ పార్టీ నేతలు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ హైకోర్టులో కేసు పడిన తర్వాత అందరూ కూలికి వెళ్ళడం మానుకున్నారు. బహుశః ఇదంతా ఆంద్రా ప్రజలకి కూడా గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో, కేసీఆర్ ఫామ్హౌస్లో ఉన్నప్పుడు ఏప్రిల్ 27 మళ్ళీ వచ్చింది. కనుక హనుమకొండలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అట్టహాసంగా నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దేశంలో అతి తక్కువ సమయంలోనే బిఆర్ఎస్ పార్టీ ధనిక పార్టీగా ఆవిర్భవించింది. ఎలా?అని ప్రశ్నిస్తే గులాబీ నేతలకు కోపం వస్తుంది. కానీ తమది ధనిక పార్టీ అని తెలియని గులాబీ పార్టీ కార్యకర్తలు అలవాటు ప్రకారం బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకి నిధులు సమీకరించేందుకు భద్రాచలం పట్టణంలోని ఓ టింబర్ డిపోలో గులాబీ కూలి చేశారు. వారికి ఆ మిల్లు యజమాని ‘గులాబీ కూలి’ ముట్టజెప్పారు.
సింహం ముసలిదైనా సింహమే. బిఆర్ఎస్ పార్టీ కూడా అటువంటిదే. కనుక కూలికి వస్తామంటే ఎవరూ కాదనగలరు?




