ఊహించని ఓటమి ఆశించిన అవకాశాన్ని దూరం చేయడంతో జగన్ తన పార్టీ శ్రేణులకు భరోసా కల్పించడానికి, పార్టీ ని తిరిగి నిలబెట్టడానికి, వారిలో నూతన ఉత్తేజం నింపడానికి ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ 2.0 ని చూస్తారు అందరు అంటూ పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడారు.
అయితే ఓటమి తరువాత ఏపీలో వైసీపీ చేస్తున్న రాజకీయం చూస్తుంటే జగన్ 2.0 విధానాలు అప్పుడే మొదలైపోయాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. గల్లీలో పరిష్కరించుకోవాల్సిన సమస్యల కోసం ఢిల్లీలో పోరాటాలు చేస్తున్న వైసీపీ, ఢిల్లీలో తేల్చుకోవాల్సిన రాజకీయ లెక్కల పై గల్లీ వీధులలో విమర్శలు చేస్తుంది.
కూటమి అధికారంలోకి రావడంతో ఏపీలో వైసీపీ కార్యకర్తల ప్రాణాలకు రక్షణ లేదు, మా పార్టీ నాయకులకు భద్రత లేదు, ఏపీలో పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, శాంతి భద్రతలు గాల్లో కలిసిపోయాయి, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి అంటూ వైసీపీ గత ఏడాది ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా రాష్ట్ర పరువును పోరాటాల రూపంలో ఢిల్లీ వీధులలో నగ్నంగా నిలబెట్టింది.
అయితే ఇది రాష్ట్ర స్థాయి సమస్య, ఈ సమస్యకు పరిస్కారం కూడా రాష్ట్ర స్థాయిలోనే ఉంటుంది, రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ వివాదాలను, హత్య రాజకీయాలుగా చిత్రీకరించి గల్లీ సమస్యలను ఢిల్లీలో చాటి చెప్పిన వైసీపీ , ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వక్ఫ్ బిల్లు పై ఢిల్లీలో పోరాడాల్సింది పోయి ఏపీ గల్లీ వీధుల్లో విమర్శలు చేస్తూ మత రాజకీయాలను ప్రోత్సహిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం లో ఉన్న బీజేపీ ముస్లిం ల పరిరక్షణకే ఈ వక్ఫ్ బిల్లును తీసొకొచ్చాం అంటూ ముందుకెళుతుంటే, ఆ బిల్లుకి మద్దతుగా బీజేపీ మిత్ర పక్ష పార్టీలన్నీ కూడా తమ ఆమోదాన్ని తెలిపాయి. అందులో టీడీపీ, జనసేనలు కూడా భాగమయ్యాయి. అయితే వైసీపీ మాత్రం రెండు నాల్కల ధోరణి తో ఇటు లోకసభలో వ్యతిరేకిస్తూ, అటు రాజ్యసభలో మాత్రం మద్దతు తెలిపినట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి తెలిపారు.
అయితే ఇప్పుడు ఢిల్లీలో పరిక్షరించుకోవాల్సిన ఈ సమస్య పై ఏపీలో పోరాటం చేస్తుంది వైసీపీ. దీనితో వైసీపీ చేస్తున్న రాజకీయాలు రాష్ట్రం కోసమో, రాష్ట్ర ప్రజల కోసమో కాదనేది స్పష్టమవుతుంది. ఇక పాస్టర్ ప్రవీణ్ మరణం పై కూడా వైసీపీ తనదైన స్టైల్ లో మత రాజకీయాలను ప్రోత్సహించి, రాష్ట్రంలో మత విద్వేషులను రెచ్చకొట్టే యత్నం చేసింది.
ఇప్పుడు తిరుమల గోశాలలో గోవుల మరణాలు అంటూ తిరుమల పవిత్ర పై విషం చిమ్మే రాజకీయం మొదలు పెట్టింది. ఇక ఏపీ రాజధాని అమరావతి పై, అక్కడి నిర్మాణాల పై వైసీపీ చేసే దుష్ప్రచారం మూడు పార్టీల కూటమి ప్రభుత్వం కూడా అడ్డుకోలేకపోతుంది.
అలాగే జగన్ పర్యటనలో భద్రతా లోపం అంటూ వైసీపీ చేసిన రాజకీయం, పోలీసుల గుడ్డలూడతీస్తా అంటూ జగన్ అండ్ కో చేస్తున్నహెచ్చరికలు, మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మిమ్మల్ని నరికేస్తాం అంటూ వైసీపీ నేతలు ఇస్తున్న బెదిరింపులు, కూటమి ప్రభుత్వం పై చేస్తున్న అసత్యపు ఆరోపణలు,
ఆగని వైసీపీ సోషల్ మీడియా ఉన్మాద చర్యలు, ఇలా ప్రతి విషయంలోనూ వైసీపీ చేస్తున్న రాజకీయం చూస్తుంటే వైసీపీ మేకోవర్ అయ్యిందా.? జగన్ 2.0 రాజకీయం ఏపీలో అమలవుతుందా.? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే వైసీపీ ఇప్పుడే ఈ స్థాయిలో రాజకీయం చేస్తుంది అంటే ఇక రానున్న నాలుగేళ్లు కూటమి ప్రభుత్వానికి అటు పాలనతో పాటుగా ఇటు ప్రత్యర్థి పార్టీని ఎదుర్కోవడం కూడా సవాళ్లతో కూడుకున్నదే అవుతుంది.




