టిడిపిని అడ్డుకునేందుకు ఎన్డీయేలో చేరేందుకు జగన్‌ సిద్దపడ్డారా?

YS Jagan Modi

రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర మహాసంగ్రామమని మన ‘అర్జునుడు’ డిక్లేర్ చేసేశారు. ఈ యుద్ధంలో గెలవడం అందరి కంటే జగన్మోహన్‌ రెడ్డికి చాలా ముఖ్యం. లేకుంటే తర్వాత ఎదురయ్యే పరిస్థితులను ఊహించుకోవడం కూడా కష్టం. అందుకే యుద్ధం, సిద్ధం అంటున్నారనుకోవచ్చు.

యుద్ధం అంటే ఎన్నికలలో దౌర్జన్యాలు, దాడులే. అరసవెల్లి పాదయాత్రగా వెళుతున్న అమరావతి రైతులపైనే వైసీపి శ్రేణులు దాడులకు తెగబడినప్పుడు, ఎన్నికలలో గెలిచేందుకు టిడిపి, జనసేనలపై దాడులు చేయకుండా ఉంటారనుకోలేము.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ నన్ను ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడుతున్నారనే జగన్‌ మాటలకు అర్దం బహుశః ఇదే కావచ్చు. చంద్రబాబు నాయుడు ఈవిషయం ఎప్పుడో పసిగట్టారు. అందుకే జనసేనతో ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తుకి సిద్దపడుతున్నారని భావించవచ్చు.

టిడిపి, జనసేనలు కలిస్తే వైసీపికి ఎదురీత తప్పదు కనుకనే అవి కలవకూడదని జగన్మోహన్‌ రెడ్డి కోరుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ కూడా వాటితో పొత్తుకి సిద్దమవుతుండటం జగన్‌కు చాలా ఆందోళన కలిగించే విషయమే కదా? ఒకవేళ వాటితో బీజేపీ కలిస్తే, ఎన్నికలలో వైసీపి చెలరేగిపోకుండా కేంద్ర ఎన్నికల కమీషన్‌తో కేంద్రం నియంత్రించాలని చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఆశిస్తున్నారు. అదే జరుగుతుందని జగన్‌కు కూడా తెలుసు. ఈ యుద్ధంలో కూడా ఢిల్లీలో ‘శ్రీకృష్ణుడు’ ఎవరివైపు ఉంటే వారే గెలుస్తారని వేరే చెప్పక్కరలేదు.

అందుకే జగన్‌ హడావుడిగా ఢిల్లీలో వాలిపోయి ప్రధాని నరేంద్రమోడీని కలిసి ఉండవచ్చు. కానీ ఈ భేటీ గురించి వైసీపి ఎంపీ రఘురామ కృష్ణరాజు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

“సాధారణంగా పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలుస్తుంటారు. కనుక ఏ ముఖ్యమంత్రి అడిగినా ప్రధాని వెంటనే అపాయింట్మెంట్ ఇస్తుంటారు. మరో విధంగా చెప్పాలంటే ఇది ‘ధర్మదర్శనమే.’ ఆవిధంగానే 3-4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రధానిని కలిశారు. జగన్‌ కూడా కలిశారు.

కానీ నిజానికి జగన్‌ కలవాలనుకున్నది ప్రధాని మోడీని కాదు…. కేంద్ర హోంమంత్రి అమిత్ షాని! టిడిపి, జనసేనలతో చేతులు కలపవద్దని అవసరమైతే వైసీపి ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్దంగా ఉందనిఅమిత్ షాకు చెప్పాలనుకున్నారు.

కానీ టిడిపి, జనసేనలతో కలిసి సాగాలని అమిత్ షా అప్పటికే నిర్ణయం తీసేసుకొన్నందున అపాయింట్ ఇవ్వలేదు. ఇవ్వరని నేను ముందే చెప్పాను కూడా! కానీ ఇస్తారనే ఆశతో జగన్‌ ఢిల్లీ వచ్చారు… నిరాశతో వెనుతిరిగారు. త్వరలోనే టిడిపి, జనసేన, బీజేపీల పొత్తులపై అధికారిక ప్రకటన వెలువడనుంది,” అని రఘురామ కృష్ణరాజు చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories