ఓ రాష్ట్రాన్ని లేదా దేశాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పాలించాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్నుకున్న జగన్ ప్రభుత్వం సచివాలయాలు, వాలంటీర్లు, సలహాదారులు, ఐ-ప్యాక్ వంటి సరికొత్త వ్యవస్థలను సృష్టించి వాటితో రాష్ట్ర రాజకీయాలను తనకు నచ్చిన్నట్లు మార్చుకుని పరిపాలించడం అందరూ చూశారు.
రాష్ట్రాన్ని నడపాల్సిన వ్యవస్థలను జగన్ ప్రభుత్వం సృష్టించిన ఈ కొత్త వ్యవస్థలు నిర్వీర్యం చేయడమే కాకుండా వాటిని తమ అధీనంలోకి తీసుకొని రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేయడంలో అన్నివిధాల జగన్ ప్రభుత్వానికి సహకరించాయని చెప్పక తప్పదు.
ఒక వ్యక్తి కోసం కొన్ని వ్యవస్థలు సృష్టించుకోవడమే తప్పు. మళ్ళీ ఆ వ్యవస్థలు, వాటిలో పనిచేస్తున్న కొంతమంది కలిసి ప్రభుత్వ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయడం, రాష్ట్ర రాజకీయాలను శాశించాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు.
అంటే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు, చట్టాలు, కోర్టులు ఏవీ అవసరం లేదని వైసీపి నేతలు భావిస్తున్నారా? వీటన్నిటికీ తాము అతీతమని భావిస్తున్నారా?అని సందేహం కలుగక మానదు.
ఉదాహరణకు వాలంటీర్లనే తీసుకుంటే, వారు ప్రజలకు సేవ చేయడానికే అని జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ పదేపదే చెప్పుకున్నారు. కానీ ఎన్నికల గంట మ్రోగేసరికి వారందరూ తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వైసీపికి సేవ చేయాలని హుకుం జారీ చేశారు. అంటే వైసీపి కోసమే వాళ్ళను ఏర్పాటు చేసుకున్నామని వారే చివరికి నిరూపించి చూపుకున్నారు కదా?
ఐ-ప్యాక్ ఓ రాజకీయ చీడపురుగు అని చెప్పక తప్పదు. అది ప్రజాస్వామ్య బద్దంగా నడవాల్సిన మన రాజకీయ వ్యవస్థని పైకి కనపడకుండా లోపల నుంచే దొలిచేస్తూ చివరికి ఈ దుస్థితికి తీసుకువచ్చింది.
రాజకీయ నాయకులు పదవీ కాంక్షను పసిగట్టి ఎన్నికలను వ్యాపారంగా మార్చిసిన ఘనత ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్కే దక్కుతుంది. ఆయన సృష్టించిందే ఈ ఐ-ప్యాక్.
ప్రశాంత్ కిషోర్ మొదలుపెట్టిన ఈ ఎన్నికల వ్యాపార విజయానికి నిలువెత్తు నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి కళ్లెదుటే ఉన్నారు. అయితే వ్యాపారాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి కూడా చాలా దిట్ట. కనుక ఈ ఎన్నికల వ్యాపార సూత్రాలను బాగా ఆకళింపు చేసుకొని వాటికి వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను కూడా జోడించి మరింత మెరుగులు దిద్దారు. ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టి ఐ-ప్యాక్, వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు ఈ మూడింటినీ తెలివిగా ఉపయోగించుకుంటూ రాష్ట్ర రాజకీయాలలో ‘వైసీపి పోలరైజేషన్’కు గట్టి ప్రయత్నాలు చేశారు. ఇందుకు కోసం రాష్ట్ర ప్రజలను ఎక్కడికక్కడ కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల వారీగా చీల్చేందుకు వెనకాడలేదు. తన ఈ ప్రయోగం కూడా విజయవంతం కాబోతోందని, జూన్ 4 ఫలితాలు వెలువడినప్పుడు యావత్ దేశ ప్రజలు మనల్నే చూస్తారని జగన్ స్వయంగా నిన్ననే ఐ-ప్యాక్ టీమ్కు కూడా చెప్పారు.
ఈ 5 ఏళ్ళ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాలను, వ్యవస్థలను భ్రష్టు పట్టించేయడమే కాక, వాలంటీర్లు, ఐ-ప్యాక్ ప్రచారం ద్వారా రాష్ట్ర ప్రజల ‘బ్రెయిన్ వాష్’ చేస్తూ నిలువునా రెండుగా చీల్చడం చాలా దారుణమే కదా?ఇంకా భ్రష్టు పట్టించడానికి, దోచుకోవడానికి రాష్ట్రంలో ఏమి మిగిలి ఉందని మళ్ళీ మమ్మల్నే గెలిపించమని అడుగుతున్నారో వారికే తెలియాలి!




