ఒకప్పటి సాఫ్ట్వేర్ ఉద్యోగాల పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు. నాడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిగ్రీ చేస్తే చాలు మంత్రదండంతో తిప్పినట్లు జీవితాలు అమాంతం అద్భుతంగా మారిపోయేవి. చేతి నిండా డబ్బు, ఆస్తులు, సమాజంలో గౌరవం అన్నీ వరుసగా వచ్చేసేవి. సాఫ్ట్వేర్ రంగం తొలినాళ్ళలో ఆ అవకాశాలు అందిపుచ్చుకున్నవారికి ఈ విషయం తెలుసు.
కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే బొటాబొటి జీతాలు, విపరీతమైన పని ఒత్తిడి, ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఉద్యోగాలకు భద్రత లేకపోవడం వంటి అనేక సమస్యలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. కనుక ఎంత పెద్ద కంపెనీలో ఉద్యోగం దొరికినా ఆ సంతోషాన్ని అనుభవించలేని దుస్థితి నెలకొంది.
ఇటీవల ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ వంటి అనేక కంపెనీలు వేలాది మందిని ఉద్యోగాలలో నుంచి తొలగించాయి. వచ్చే నెలలో అమెజాన్ కంపెనీ మరో 14,000 మందిని తొలగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఉద్యోగులను తొలగించడానికి వాటి కారణాలు, సమస్యలు, లెక్కలు వాటికి ఉంటాయి. కనుక వాటిని తప్పు పట్టలేము.
అలాంటి ప్రముఖ ఐటి కంపెనీలను రప్పించేందుకు రాష్ట్రాలు పోటీలు పడి మరీ రాయితీలు ఇస్తుంటాయి. వాటిని ఆకర్షించేందుకు అవి కోరిన ప్రాంతాలలో, కోరినన్ని ఎకరాలు భూములు నామ మాత్రపు ధరలకే కేటాయిస్తుంటాయి. ఇందుకు ప్రతిగా ఒక్కో కంపెనీ నిర్దిష్టంగా ఇంత మందికి ఉద్యోగాలు ఇస్తామని ఎంవోయూలలోనే హామీ ఇస్తుంటాయి.
కానీ ఉద్యోగాలు కల్పించినట్లే కల్పించి, ఏడాదికో రెండేళ్ళకో వాళ్ళని ఉద్యోగాలలో నుంచి పీకేస్తుంటే ఆ ఉద్యోగులు, వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? అని ఐటి కంపెనీలు ఆలోచించకపోవచ్చు. కానీ ప్రభుత్వాలు తప్పక ఆలోచించాలి! ఎందుకంటే వాటికి అవే రాయితీలు ఇస్తాయి కనుక!
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వాలు వాటికి ఇన్ని రాయితీలు, భూకేటాయింపులు చేస్తున్నప్పుడు అవి ఆ హామీకి కట్టుబడి ఉండకపోతే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కదా?
నిరుద్యోగులుగా ఉన్నప్పుడు అనుభవించే కష్టనష్టాల కంటే, ఒకసారి ఉద్యోగాలలో చేరి వాటిని పోగొట్టుకొని మళ్ళీ నిరుద్యోగులుగా మారినప్పుడు అనుభవించే కష్టనష్టాలు, మానసిక క్షోభ పది రెట్లు ఎక్కువగా ఉంటుందనే విషయం ఆ బాధలు అనుభవించిన వారికే అర్ధమవుతుంది.
హటాత్తుగా ఉద్యోగాలలో నుంచి తీసేస్తే ఆదాయం ఆగిపోతుంది. కానీ కుటుంబ ఖర్చులు, ఈఎంఐలు ఏవీ ఆగవు. మరీ ముఖ్యంగా ఇంటి అద్దెలు, స్కూలు ఫీజులు, పెట్రోల్, గ్యాస్, పన్నులు ప్రతీదీ నానాటికీ పెరిగిపోతూనే ఉంటాయి తప్ప ఏవీ తగ్గవు. ఉద్యోగం, ఆదాయం పోయినప్పుడు ఎలా జీవించాలి?
కనుక ఈ సమస్య తీవ్రతని ప్రభుత్వాలు గ్రహించి, ఇలాంటి పరిస్థితులలో ఉద్యోగులకు తగిన భద్రత కల్పించే విధంగా నూతన విధానాలు రూపొందించాలి.
రాయితీలు పొందుతున్న కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగులను తొలగించేటప్పుడు, వారికి తగిన నష్ట పరిహారం లేదా ఆరు నెలలు లేదా ఏడాది పాటు వారికి నెలనెలా కొంత మొత్తం చెల్లించేలా నిబందనలు ఏర్పాటు చేయాలి.
లేకుంటే ఉద్యోగాలు పోగానే మొదట ఆర్ధిక సమస్యలు, ఆ కారణంగా కుటుంబ సమస్యలు, ఆ కారణంగా హత్యలు, ఆత్మహత్యలతో సమాజం చిద్రం అవుతుంది. ఆర్ధిక సమస్యలు అధిగమించేందుకు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారున్నారు.
లేదా మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలు, కుటుంబాలు నాశనం చేసుకున్నవారు కూడా ఉన్నారు. సమాజంలో ఇలాంటి అవాంచనీయ పరిణామాలు, మార్పులు జరుగుతుంటే అది ప్రభుత్వాలకు అప్రదిష్టం తీరని భారంగా మారుతుంది.
కనుక ఐటి కంపెనీలలో ఉద్యోగులకు కనీస భద్రత ఉండేలా ప్రభుత్వాలు నూతన విధివిధానాలు రూపొందించి ఎంఓయూలలోనే పొందు పరచడం, వాటిని ఖచ్చితంగా అమలుచేయడం చాలా అవసరం.






