ఒకప్పటి ఐటి రంగం… దానిలో ఉద్యోగాలు వేరు. ఇప్పటి ఐటి కంపెనీలు.. వాటిలో ఉద్యోగాలు వేరు. నాడు నైపుణ్యంతో పని చేయగలిగితే చాలు మంచి గుర్తింపు, గౌరవం, ప్రమోషన్స్, జీతభత్యాలు అన్నీ పెరిగేవి.
కానీ ఇప్పుడు భరించలేనంత పని ఒత్తిడి. ఆఫీసులో పనిచేయడమే నరకమనుకుంటే, ఇంటి నుంచి (వర్క్ ఫ్రమ్ హోమ్) ఇంకా నరకంగా మార్చేశారు. రాత్రి లేదు పగలూ లేదు.. ఎప్పుడూ ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. మీటింగుల మీద మీటింగులు జరుగుతూనే ఉంటాయి. రోజుకి 16-20 గంటలు పనిచేస్తున్నవారు కోకోల్లలున్నారు.
ఎంత నైపుణ్యం ఉన్నా, ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఉద్యోగాలకు భద్రత లేదు. తెల్లవారుజాము వరకు పనిచేసి ల్యాప్ టాప్ మూసేస్తుంటే ఓ ఈ మెయిల్.. ఏమిటని చూస్తే ఉద్యోగంలో నుంచి పీకేశామని!
ఈ ఒత్తిళ్ళు భరించలేక కొందరు మద్యం, డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేకమంది కాపురాలు విచ్చినమవుతున్నాయి.
కనుక ఈ భాధలు, ఒత్తిళ్ళు భరించలేక కేరళలో ఓ మహిళా మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆటో రిక్షా నడుపుకోవడం మొదలుపెట్టారు.
ఆదాయం తక్కువే అయినా ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉందని చెప్పారు. తొమ్మిదేళ్ళపాటు ఐటి కంపెనీలో పనిచేశానని కానీ ఎన్నడూ కంటి నిండా సుఖంగా నిద్రపోలేదని, ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని గ్రహించి ఉద్యోగానికి రాజీనామా చేసి ఆటో కొనుక్కొని, తనకు ఓపిక, ఖాళీ ఉన్నప్పుడు నడుపుకుంటున్నానని చెప్పారు.
లక్షల జీతం వచ్చే ఆమె ఐటి ఉద్యోగం విడిచిపెట్టడమే ఒక సాహసం అనుకుంటే, మళ్ళీ ఆటో రిక్ష నడపాలనుకోవడం ఇంకో సాహసమే. ఎందుకంటే ఈ రంగంలో ఉండే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ముందుగా ఆమె భద్రత, నానాటికీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వంటి అనేక సమస్యలు ఉంటాయి.
కానీ ఐటి రంగంతో పోలిస్తే తక్కువే. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు ఆటో ద్వారా వచ్చే ఆదాయం కూడా తక్కువే. కానీ మనశాంతి దొరికిందని చెప్తున్నారు ఆమె!




