ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. జగన్ తొలిసారిగా సిఎం అయిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థని సృష్టించి వారి ద్వారానే 5 ఏళ్ళ పాటు సంక్షేమ పధకాల అమలు చేశారు. నిజంగానే ఆ ఐడియా వైసీపీ భవిష్యత్ని తారుమారు చేసేసింది. చివరికి లక్షల మంది వాలంటీర్ల కథ ఏవిధంగా ముగిసిందో అందరూ చూశారు.
ఆ ప్రయోగం బెడిసికొట్టింది కనుక ఈసారి మళ్ళీ అధికారంలోకి రాగానే కార్యకర్తల ద్వారానే సంక్షేమ పధకాలు అమలుచేస్తామని జగన్ చెప్పారు. నేడు తాడేపల్లి ప్యాలస్లో రంపచోడవరం నియోజకవర్గం వైసీపీ నేతలతో సమావేశమైనప్పుడు మాట్లాడుతూ, “జగన్ 2.0లో కార్యకర్తలకే పూర్తి ప్రాధాన్యత ఇస్తాను. ఈసారి వారిని బాగా చూసుకుంటాను. వారి ద్వారానే అన్నీ అమలుచేస్తాను,” అని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
‘జగన్ 2.0’ అనగానే సమావేశానికి హాజరైనవారు చప్పట్లు చరిచి ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఊహే ఎంతో మధురంగా ఉంటుంది కనుక చప్పట్లు సహజమే. కానీ ఈసారి కార్యకర్తలకే ప్రాధాన్యం అని చెప్పడం అంటే ఈసారి ‘వాలంటీర్లు’ ఉండబోరని, వాలంటీర్ల వ్యవస్థ సరికాదని జగన్ అంగీకరించినట్లే కదా?
రాజకీయాలలో అటువంటి తప్పులు సహజం. కనుక తప్పులు సరిదిద్దుకోవాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ ‘జగన్ 2.0’ అంటుంటే, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నవారికి, పారిశ్రామికవేత్తలకు ‘జగన్ 2.0’ ఎట్టి పరిస్థితులలో ఉండబోదని నచ్చజెప్పుకోవాల్సివస్తుండటం విశేషం.
కనుక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ని అమరావతి లేదా అభివృద్ధి నిర్దేశించబోతోందా లేక జగన్ చెప్పుకుంటున్న ‘జగన్ 2.0’ నిర్దేశించబోతోందా?



