తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ స్పూర్తితో, ఆయనతో పోటీ పడుతూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసి చూపి ఉంటే నేడు ఎన్నికలను, ప్రత్యర్ధ పార్టీలను చూసి ఇంత భయాందోళనలు చెందాల్సిన అవసరమే ఉండేది కాదు. రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామికాభివృధ్దిలో కేసీఆర్ స్ఫూర్తిని జగన్ స్వీకరించలేదు కానీ ఆయనలో అవలక్షణాలన్నిటినీ పుణికిపుచ్చుకున్నారు.
కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షాలను లేకుండా చేసి ఎల్లకాలం తామే పరిపాలన చేయాలనుకున్నారు. ఇక్కడ జగన్ ప్రభుత్వం కూడా అదేవిదంగా చేస్తోంది.
కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బిఆర్ఎస్ పార్టీ అన్నట్లు పదేళ్ళపాటు తన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల చేత వీర భజనలు చేయించారు. ఇక్కడ ‘నువ్వే మా నమ్మకం జగన్’, ‘నువ్వే మా భవిష్యత్ జగన్’ అంటూ భజన చేయిస్తున్నారు.
కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ తప్ప మరొకరికీ తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్ల ఆసక్తి, చిత్తశుద్ధి లేవని, తాము గాక వేరెవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణ సర్వనాశనం అయిపోతుందని కేసీఆర్తో సహా బిఆర్ఎస్ నేతలందరూ వాదించారు. ఇక్కడ జగన్, వైసీపి నేతలు కూడా అలాగే చెప్పుకుంటున్నారు.
కేసీఆర్ ప్రజల మద్యకు వెళ్ళేందుకు ఇష్టపడేవారుకారు కానీ వ్యక్తి పూజని చాలా ప్రోత్సహించేవారు. ఇక్కడ జగన్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారు.
కేసీఆర్ యాదాద్రి ఆలయంలో తన బొమ్మ చెక్కించుకుని తాను దైవస్వరూపుడినని చెప్పుకునే ప్రయత్నం చేయగా, క్రిస్మస్ పండుగ సందర్భంగా జగన్ కూడా రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తదితర దుష్టుల నుంచి కాపాడేందుకు వచ్చిన దైవదూతగా అభివర్ణించుకుంటూ పోస్టర్స్ పెట్టించుకోవడం అందరూ చూశారు.
అందరూ దేవుడిని దర్శించుకోవడానికి ఆలయాలకు వెళతారు. కానీ మొన్న సంక్రాంతి పండుగకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్నే జగన్ తన నివాసానికి రప్పించుకున్నారు. అంటే దేవుడే తన దర్శనం చేసుకోవాలని జగన్ అనుకున్నారన్న మాట!
కేసీఆర్ అమలుచేసిన అన్ని పధకాలకు లోగోలు ఉన్నాయి. కానీ దళిత బంధు పధకానికి మాత్రం తన ఫోటోని పెట్టుకుని వెనుక అంబేడ్కర్ ఫోటోని ముద్రింపజేసుకున్నారు. అంటే తాను అంబేడ్కర్ అంతటి మహనీయుడినని కేసీఆర్ చెప్పుకోవాలనుకున్నారు. ప్రజలు కూడా అలాగే గుర్తించాలనుకున్నారు. తన పార్టీ నేతలతో అలాగే జోరుగా ప్రచారం చేయించుకున్నారు కూడా. కేవలం కేసీఆర్ మాత్రమే ఈ దేశాన్ని, దళితులను కాపాడగలరని చేయించుకున్న ప్రచారం అందరూ వినే ఉంటారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని అవిష్కరణ కార్యక్రమంలో ఆయన గొప్పదనం, దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి గురించి మాట్లాడుకోవలసి ఉండగా, ఆయన కంటే తానే ఎక్కువ చేశానన్నట్లు జగన్ గొప్పలు చెప్పుకోవడం, అంతటా జగన్ ఫోటోలు, బ్యానర్లు, చివరికి లేజర్ షోలో కూడా జగన్ చిత్రాలు ప్రదర్శించారు. అంటే కేసీఆర్లాగే జగన్ కూడా తాను అంబేడ్కర్ కంటే గొప్పవాడినని ప్రజలు గుర్తించాలని కోరుకుంటున్నారన్న మాట!
హైదరాబాద్లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ గవర్నర్ని ఆహ్వానించలేదు. నిన్న విజయవాడలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా గవర్నర్ని ఆహ్వానించలేదు.
తాను దైవాంశ సంభూతుడినని, గాంధీజీ, అంబేడ్కర్ అంతటివాడినని కేసీఆర్ అనుకున్నారు కానీ తెలంగాణ ప్రజలు అనుకోలేదు… కనుక ఆయనని పక్కన పెట్టారు.
ఇక్కడ జగన్ కూడా తన గురించి తాను అలాగే గొప్పగా ఊహించుకుంటున్నారు. కనుక బహుశః రేపు ఆయనకీ ఇదే ముగింపు ఉంటుందేమో?




