ఇటీవల జగన్ తెనాలి వెళ్ళి రౌడీ షీటర్లను పరామర్శించడానికి బయలుదేరుతునప్పుడే అనేక విమర్శలు వినిపించాయి. కానీ జగన్ ఏమాత్రం సంకోచించకుండా వెళ్ళి పరామర్శించడమే కాకుండా “వాళ్ళు చిన్న పిల్లలు తప్పులు చేయడం సహజం” అంటూ వెనకేసుకు వచ్చారు.
అప్పుడే సిఎం చంద్రబాబు నాయుడు ఓ మాటన్నారు. “జగన్ అసాంఘిక శక్తులను పోగేసి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని కుట్రలు చేస్తున్నారు. ఇటువంటి నేర రాజకీయలు చేసే జగన్తో మరింత అప్రమత్తంగా ఉండాలని” పార్టీ నేతలను హెచ్చరించారు.
సిఎం చంద్రబాబు నాయుడు ఆ మాట అన్న రెండు మూడు రోజులకే సాక్షి మీడియాలో ‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ మాట్లాడించారు.
సాక్షిలో ముద్రించే ప్రతీ అక్షరం, పలికే ప్రతీ మాట జగన్కు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా జరుగదు. ఎందుకంటే ‘వైసీపీకి ఎక్స్టెన్షన్’ వంటిదే సాక్షి మీడియా కనుక!
జగన్ వ్యూహాలుగా చెప్పుకునే కుట్రలలో భాగంగానే సాక్షి మీడియా ప్రతీరోజూ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతోంది.
కనుక అమరావతి మహిళల గురించి సాక్షి మీడియాలో చేసిన వ్యాఖ్యలు అనాలోచితంగా లేదా యాదృచ్ఛికంగా జరిగినవి కావని, జరుగుతున్న పర్యవసానాలను ముందుగానే ఊహించి పక్కా ప్లాన్తో చేసిన వ్యాఖ్యలే అని చెప్పక తప్పదు.
అవునా కాదా? అనేది ప్రభుత్వమూ, పోలీసులు కనుగొనాలి. ఇది ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు చేసిన కుట్రే అయితే తగు చర్యలు చేపట్టడం చాలా అవసరం.
సాక్షి వ్యాఖ్యలతో రాష్ట్రంలో నిప్పు రాజేసి జగన్ చేతులు ముడుచుకు కూర్చోలేదు. వెంటనే నేడు ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించే పేరుతో వచ్చినప్పుడు, వైసీపీ శ్రేణులు ప్లకార్డులు పట్టుకొని శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలపై ఏవిదంగా రాళ్ళతో దాడులు చేశారో అందరూ చూశారు. ఆ దాడులలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు.
గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజధాని రైతులు రోడ్డు కిరువైపులా నిలబడి నిరసనలు తెలియజేసినప్పుడు జగన్ వారిని పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు.
కానీ ఇవాళ్ళ జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి మహిళలని కూడా చూడకుండా వారిపై రాళ్ళతో దాడులు చేయడం యాదృచ్ఛికమా? అంటే కాదనే అర్దమవుతోంది.
ఏదో విదంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చూపించగలిగితే ఏమవుతుంది?అంటే అమరావతికి, రాష్ట్రానికి రుణాలు, పరిశ్రమలు, పెట్టుబడులు నిలిచిపోతాయి.
కనుక జగన్కు పూర్తి స్పష్టత ఉందని స్పష్టంఅవుతోంది. మరి ఆయనని, వైసీపీని ఏవిదంగా హ్యాండిల్ చేయాలో కూటమి ప్రభుత్వానికి స్పష్టత ఉందా? ఏమో!




