కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగానే 2019 ఎన్నికలలో జగన్ గెలుపుకి ఎంతోమంది నాయకుల తోడ్పాటు కారణమనేది కాదనలేని రాజకీయ సత్యం. ప్రతేకహోదా పోరాటాలతో అప్పటికే కేంద్రంతో కయ్యానికి వెళ్లిన చంద్రబాబు బీజేపీ పెద్దల ఆగ్రహానికి తోడు, ఇటు 2018 తెలంగాణ ఎన్నికలలో తెరాస పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమితో టీడీపీ చేతులు కలపి పనిచేయడం కేసీఆర్ కు చంద్రబాబు శత్రువుగా మారిపోయాడు.2018 తెలంగాణ ఎన్నికలు బాబుకి మరికొంతమంది రాజకీయ శత్రువులను తెచ్చిపెట్టింది.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ వరంగల్ రైల్వే స్టేషన్లో జగన్ కు వ్యతిరేకంగా అక్కడి తెలంగాణ వాదులు రాళ్లతో జగన్ పై దాడి చేసి “గో బ్యాక్ జగన్” అంటూ నినాదాలు కూడా చేశారు. అయితే రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఎవరు ఉండరు అనే సూత్రాన్ని ఫాలో అయినా జగన్, కేసీఆర్ తమకు ఉమ్మడి శత్రువైన చంద్రబాబుని దెబ్బకొట్టడానికి 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఎంచుకున్నారు.
చంద్రబాబు నీకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జగన్ కు బహిరంగంగానే మద్దతు పలికినట్టే భావించాలి. దానికి తోడు కేంద్రంలో బీజేపీ పెద్దలతో వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డి చేసిన రహస్య మంతనాలు అన్ని కలిసి టీడీపీ ఓటమికి సాక్ష్యాలుగా మిగిలాయి. అయితే జగన్ గెలుపులో కేసీఆర్ పాత్ర కాదనలేని వాస్తవం. ఇప్పుడు జగన్ కు ఆ ఋణం తీర్చుకునే అవకాశం వచ్చింది చూడాలి మరి కేసీఆర్ గెలుపుకి జగన్ ఇంకేం చేస్తారో మరి!
ఒకరకంగా చెప్పాలంటే జగన్ గెలిచిన నాటి నుంచే అటు కేసీఆర్ కు ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలుచేస్తూనే వస్తున్నారు. అధికారంలో వచ్చి రాగానే కొన్ని వేల కోట్ల ఏపీ ఆస్తులను ఒకే ఒక్క సంతకంతో తెలంగాణ ప్రభుత్వానికి దారాదత్తం చేసేసారు. అలాగే కృష్ణ నదీ జలాల వాటాలో ఏపీకి జరుగుతున్న అన్యాయానికి మౌనమే తన సమాధానం అన్నట్టు జగన్ మిన్నకుండి పోయారు.
అమరావతి రాజధాని నిర్మాణంతో అడుగులు ముందుకు వేయాలన్న ఏపీ అభివృద్ధిని ఒకే ఒక్క ప్రకటనతో కాలరాసేసారు. అభివృద్ధి సంగతి పక్కన పెడితే ఉన్న పెట్టుబడులు కూడా పక్క రాష్ట్రానికి తరలిపోయేలా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అధిక శాతంలో లబ్ది పొందింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే.లూలు, అమర్ రాజా బ్యాటరీస్ లాంటి సంస్థలెన్నో హైద్రాబాద్ ప్రాంతానికి తరలిపోవడంలో కారుకు ఫ్యాన్ తనవంతు సహకారాన్ని అందించిందనే చెప్పాలి.
తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఆంధ్రాకు కొన్ని ఐటీ పరిశ్రమలను తానూ సిప్పారస్ చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ నిరుద్యోగ యువతకు హాస్యాన్ని తెప్పించినట్టయింది. ఏపీ యువతకు జగన్ ఒక చట్ట వ్యతిరేక వ్యవస్థనే సృష్టించిన మరీ వాలంటీర్ ఉద్యోగాలు కల్పించి నెలకు గౌరవ వేతనం 5000 వేలు నిర్ణయిస్తే కేటీఆర్ మాత్రం ఏపీలో ఐటీ పరిశ్రమలు ఏమి లేనట్టు జగన్ ప్రభుత్వాన్ని అవమానించడం చాలా బాధాకరం అంటూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు కేటీఆర్ పై నిరసన తెలపలేమో!
జగన్ – కేసీఆర్ ఇలా ఒకరి గెలుపుకి మరొకరు రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చుకుంటూ పొతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొట్ట చేత పట్టుకుని రిటర్న్ బస్సు ఎక్కి పక్క రాష్ట్రాలకు వలస పోవాల్సిందే. గెలుపుకి సాయం చేసిన వాడికోసం గెలిపించిన ప్రజలను రోడ్డు మీద పడేసే రాజనీతి జగన్ కు న్యాయమా? ఒక్కసారి ఆలోచించుకోవాలి.





