తెలంగాణలో ప్రారంభోత్సవాలు… ఏపీలో శంకుస్థాపనలు

Jagan Lays Foundation Stone for Central Tribal University in Vizianagaramఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలను పోల్చి చూడాల్సినవి చాలా కనిపిస్తూనే ఉన్నాయి. వాటిలో ప్రారంభోత్సవాలు… శంకుస్థాపనలు కూడా ఉండటం విశేషం. తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ని జిల్లాలలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

వాటిలో అతిపెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరం, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, హైదరాబాద్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టు, ఓ 36 ఫ్లైఓవర్లు, పోలీస్ కమాండ్ కంట్రోల్, వైట్‌హౌస్‌ని తలపించే సచివాలయం, ప్రతీ జిల్లాకు సమీకృత కలెక్టరేట్ భవనాలు, పోలీస్ ప్రధాన కార్యాలయాలు, ఫ్లైఓవర్లు, పార్కులు, చివరికి వైకుంఠ ధామాలు (శ్మశానాలు)… ఇలా చెప్పుకొంటూ పోతే ఈ జాబితాకు అంతే ఉండదు.

ADVERTISEMENT

వీటిలో కొన్నిటినీ గత ఎన్నికలకు ముందే పూర్తి చేసి ప్రారంభించగా, మిగిలిన వాటిని గత రెండు మూడేళ్ళ నుంచి పూర్తి చేసి వరుసపెట్టి ప్రారంభోత్సవాలు చేస్తూనే ఉన్నారు.

తెలంగాణ సచివాలయం ఆవరణలో కొత్తగా నిర్మించిన శివాలయం, గణపతి, హనుమాన్, నల్ల పోచమ్మ ఆలయాలలో నేడే పూజలు చేసి ప్రారంభించారు. అలాగే సమీపంలోనే కొత్తగా నిర్మించిన మసీదు, చర్చిలను కూడా నేడే ప్రారంభించారు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే తెలంగాణ ప్రతీరోజూ ఎక్కడో అక్కడ ఏదో ఓ ‘పూర్తయిన పనులకు’ ప్రారంభోత్సవాలు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తూనే ఉంటారు. ఇది కేసీఆర్‌ మోడల్ పాలన.

ఇక ఏపీలో జగన్‌ మోడల్ పాలన గురించి అందరికీ తెలిసిందే. నాలుగున్నరేళ్ళుగా సంక్షేమ పధకాలు, మూడు రాజధానుల పేరుతో కాలక్షేపం చేసేసి, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుంటే ‘అభివృద్ధికి శ్రీకారం’ చూడుతున్నారు. అంటే ప్రారంభోత్సవాలు చేయవలసిన సమయంలో ఇప్పుడు తాపీగా శంకుస్థాపనలు చేస్తున్నారన్న మాట! వాటిలో కూడా ఇదివరకు టిడిపి హయాంలోనే శంకుస్థాపనలు జరిగిన భోగాపురం విమానాశ్రయం, భావనపాడు పోర్టు వంటివి కూడా ఉన్నాయి.

అటువంటిదే విజయనగరం జిల్లా చినమేడపల్లిలో గిరిజన యూనివర్సిటీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి సిఎం జగన్‌ నేడు శంకుస్థాపన చేశారు.

విభజన హామీలలో ఇది కూడా ఒకటి. రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్ళు పూర్తయ్యాయి. ఇన్నేళ్ళ తర్వాత దానికి శంకుస్థాపన చేస్తున్నారంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏమిటో అర్దమవుతూనే ఉంది. 2024 మార్చి-ఏప్రిల్ నెలల్లో ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరుగబోతున్నాయి.

కనుక ఎవరి తాపత్రయం వారిదన్నట్లు ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ శంకుస్థాపన చేస్తున్నట్లు భావించవచ్చు. గతంలో టిడిపి ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరేదీ చేతకాదని వాదించే సిఎం జగన్‌, చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ గిరిజన యూనివర్సిటీని నిర్మించి నేడు ప్రారంభోత్సవం చేసి ఉండాలి. కానీ శంకుస్థాపన చేస్తున్నారు.

ఒకవేళ రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాలేకపోతే, సిఎం జగన్‌ ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్న ఈపనులను ఎవరు, ఎలా పూర్తి చేస్తారో చెపితే ఇంకా బాగుంటుంది.

ADVERTISEMENT
Latest Stories