ఇదివరకు జగన్ పాలనలో విశాఖ రాజధాని అంటే రుషికొండ ప్యాలస్ని చూపిస్తుండేవారు. దాంట్లో జగన్ కాపురం పెడితే విశాఖ రాజధాని అయిపోయినట్లే అని చెప్పేవారు. ఆ స్టోరీ అందరికీ తెలిసిందే. కనుక మళ్ళీ ఇప్పుడు చెప్పుకోనవసరం లేదు.
ఎన్నికలలో వైసీపీ ఓడిపోయినా తర్వాత జగన్మోహన్ రెడ్డి తనకు ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే వస్తానంటూ కుంటిసాకుతో శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నారు. కనుక అధికారంలో ఉన్నప్పుడు విశాఖ రాజధాని అంటే రుషికొండ ప్యాలస్ని చూపించినట్లే, ఇప్పుడు శాసనసభ సమావేశాలు మొదలవుతాయనగానే ప్రధాన ప్రతిపక్షనేత హోదా గురించి మాట్లాడుతున్నారు. ఇస్తే వస్తారని వచ్చి సిఎం చంద్రబాబు నాయుడుతో సహా కూటమి సభ్యులందరినీ దడదడలాడించేస్తారని, ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. పార్టీలో మిగిలిన సీనియర్ నేతలు కూడా ఆయనకు కోరస్ పాడటం మొదలుపెట్టారు.
కనుక శాసనసభ సమావేశాలంటే… ప్రధాన ప్రతిపక్షనేత హోదా అంటారన్న మాట! మరి శాసనసభ సమావేశాలకు రాకుండా ఏం చేస్తారో అందరికీ తెలుసు. తాడేపల్లి ప్యాలస్లో కూర్చొని శాసనసభ సమావేశాలను (సాక్షి) టీవీ ఛానల్లో చూసి తర్వాత ప్రెస్మీట్ పెట్టి మాట్లాడుతుంటారు. అంటే తాడేపల్లి ప్యాలస్నే శాసనసభ అనుకోవాలన్న మాట!
“నైవేద్యం లేక నీరసించిపోయాను… నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తానన్నట్లు…” జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇచ్చేస్తే వచ్చి ఎలా దడదడలాడిస్తారో తెలుస్తుంది కదా?ఇవ్వకపోతే జగన్కు భయపడే ఇవ్వడం లేదని చెప్పుకోవలసి వస్తుంది.
అయినా కాఫీ తాగితే కదా… అది కమ్మగా ఉంటుందో లేదో తెలుస్తుంది. జగన్ శాసనసభ సమావేశాలకు వస్తేనే కదా రక్తి కడతాయి?
కనుక రూల్స్ పక్కన పెట్టి ఇచ్చేస్తే పోలా? అప్పుడైనా ధైర్యంగా వస్తారో మరేదో కొత్త స్టోరీ చెపుతారో తెలిసిపోతుంది కదా?




