ఆయనో రాజకీయ మేధావి. అందుకే విభజనతో సగానికి చిక్కిపోయిన విభజిత రాష్ట్రానికి ఒక్క రాజధాని సరిపోదు.. మూడు రాజధానులు అవసరమని కనిపెట్టి చెప్పారు. కానీ తిరుగులేని మెజార్టీతో 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించినా ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఆయనే మాజీ సిఎం జగన్!
ఇవాళ్ళ 75వ రాజ్యాంగ దినోత్సవం. కనుక తాను అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్చ.. హక్కు, వగైరా పదాలన్నీ పెట్టి జగన్ ఓ పెద్ద వ్యాసం వ్రాసి సోషల్ మీడియాలో పెట్టారు.
కేవలం ఆవు గురించి మాత్రమే వ్యాసం వ్రాస్తున్న ఓ చిన్న పిల్లోడిని టీచర్, రేపు సముద్రం గురించి వ్యాసం వ్రాసుకు రమ్మంటే, “నేను మా నాన్నగారితో కలిసి నిన్న సముద్రం వద్దకు వెళ్ళాను. అక్కడ నాకు ఒక ఆవు కనిపించింది. ఆ ఆవుకు నాలుగు కాళ్ళు, రెండు కొమ్ములు.. అంటూ మళ్ళీ ఆవు వ్యాసమే వ్రాసుకొచ్చాడు.
చిన్న పిల్లోడిని కాపాడుకొస్తున్న జగన్ కూడా చిన్న పిల్లోడే గాబట్టి తనకు తెలిసిన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వంటి పదాలతో మళ్ళీ ‘బ్యాలెట్ పేపర్ వ్యాసం’ వ్రాశారని సరిపెట్టుకోక తప్పదు.
గత ఎన్నికలలో ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినప్పుడు వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింది. అప్పుడు జగన్కి వాటిలో లోపాలు కనిపించలేదు. తన ఫోటో చూసి జనాలు ఓట్లు వేశారని గట్టిగా నమ్మారు. 2024 ఎన్నికలలో కూడా జనాలు తన ఫోటో చూసి ఓట్లు వేస్తారని,175 కి 175 తనకే వస్తాయని పగటి కలలు కన్నారు.
ఎన్నికలలో ఓడిపోగానే ఈవీఎంల వలననే తాము ఓడిపోయామని ఒక్క ముక్కతో జగన్ తేల్చి పడేశారు. అప్పటి నుంచే ‘బ్యాలెట్ పేపర్ వ్యాసం’ వ్రాయడం మొదలుపెట్టారు.
మూడు రాజధానులకు ఆఫ్రికాని ఉదాహరణగా చూపించిన జగన్, బ్యాలెట్ ఎన్నికలకు అమెరికా తదితర దేశాలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు.
ముందే చెప్పుకున్నట్లు బ్యాలెట్ పేపర్ వ్యాసానికి రాజ్యాంగం, హక్కులు ప్రజాస్వామ్యం వగైరాలతో తాలింపు వేసి, ఏపీలో ఖూనీ అయిపోతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలని ముగించారు.
అంటే జగన్ అధికారంలో ఉంటే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం భద్రంగా ఉన్నట్లే. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నట్లే. అదే జగన్కు కష్టం వస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన్నట్లే.. యావత్ దేశ ప్రజలందరికీ కష్టం వచ్చిన్నట్లే అన్న మాట!




