వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ‘పోలీసుల బట్టలూడదీయిస్తా’నంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీస్ అధికారులతో సహా చాలా మంది స్పందిస్తున్నారు. ఏపీ బీజేపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా జగన్ వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
పోలీసులు అనేక ఒత్తిళ్ళు ఎదుర్కొంటూ ప్రాణాలు పణంగా పెట్టి దేశంలో శాంతి భద్రతలు కాపాడుతుంటారు కనుకనే కనిపించని ‘నాలుగో సింహం’గా పరిగణిస్తామని, అటువంటి పోలీసులను ఉద్దేశయించి జగన్ ఇంత నీచంగా మాట్లాడటం సరికాదని, పోలీసులలో వేలాది మంది మహిళలు కూడా ఉన్నారనే విషయం పట్టించుకోకుండా జగన్ అలా మాట్లాడటం చాలా తప్పన్నారు. కనుక ఇకనైనా జగన్ తన మాటలు వెనక్కు తీసుకొని పోలీసులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు.
ఇంతమంది విమర్శిస్తున్నా జగన్ పాశ్చాతాపపడలేదు కనీసం స్పందించలేదు. పైగా మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటివారు జగన్ అనుచిత వ్యాఖ్యలను సమర్ధిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు కూడా.
గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీడీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారిని జగన్తో సహా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడేవారు. ఇప్పుడు టీడీపీ, వైసీపీల స్థానాలు మారినా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గురించి చులకనగా మాట్లాడేందుకు వెనకాడటం లేదు.
సొంత తల్లిని, చెల్లిని, ముఖ్యమంత్రినే ఖాతరు చేయని జగన్ పోలీస్ అధికారులను, ఎస్సైలను ఖాతరు చేస్తారా?అంటే కాదనే అర్దమవుతుంది.
అయితే ఇది రాజకీయ సమస్య కాదు.. ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఓ పోలీస్ వ్యవస్థకి సంబందించిన విషయం. కనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, కేంద్ర హోంశాఖ స్పందించి తగు చర్యలు తీసుకోగలిగితే, పోలీసుల ఆత్మ స్థయిర్యం దెబ్బ తీసే విదంగా ఎవరూ మాట్లాడే సాహసం చేయరు.
కానీ కేవలం ఖండనలు, రాజకీయ విమర్శలతో కాలక్షేపం చేసేస్తే, ఈ దుసాంప్రదాయం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు పోలీసులు నిజంగానే అధికార, ప్రతిపక్ష పార్టీలని చూసి భయపడుతూ వారికి నచ్చిన్నట్లు పనిచేయాల్సి వస్తుంది.




