జగన్‌ అప్పుడే చెక్ ఇచ్చేశారే… విజయవాడ ఎఫెక్టేనా?

jagan-sends-rs-25l-cheque-to-martyr-family-swiftly

భారత్‌-పాక్‌ ఘర్షణలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్‌ కుటుంబానికి వైసీపీ తరపున మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ రూ.25 లక్షల చెక్ ఈరోజు అందజేశారు. జగన్‌ ఆదేశం మేరకు వచ్చి చెక్ అందజేశానని ఆమె తెలిపారు.

ఈ నెల 13న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా, గోరంట్ల మండలంలోని కల్లితండాకు వెళ్ళి మురళీ నాయక్‌ తల్లితండ్రులను పరామర్శించి వారి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు. అప్పుడే పార్టీ తరపున రూ.25 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. ప్రకటించిన మూడు రోజులలోనే ఉషశ్రీ చరణ్‌ ద్వారా చెక్ పంపించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ADVERTISEMENT

విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు జగన్‌ ముంపు ప్రాంతాలలో పర్యటించి వరద బాధితుల సహాయార్ధం పార్టీ తరపున కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కానీ ఎవరికీ చెక్కులు ఇచ్చిన దాఖలాలు లేవు.

ఒకవేళ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్ ఇచ్చినా ఇచ్చినట్లు రుజువు ఉండేది. కానీ వరద బాధితులకు వైసీపీ నేతలు మంచి నీళ్ళ ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు వగైరా పంచి పెట్టి, అవన్నీ జగన్‌ ప్రకటించిన ఆ కోటి రూపాయల పద్దులోనివే అని చెప్పుకున్నారు.

అప్పటి నుంచే జగన్‌ ఎప్పుడు ఎవరికి విరాళం ప్రకటించినా టీడీపీ నేతలు కోటి రూపాయల విరాళం గుర్తుచేసి అడుగుతుంటారు. బహుశః అందువల్లే ఈసారి జగన్‌ వెంటనే రూ.25 లక్షల చెక్కు పంపించి ఉండొచ్చు. కానీ చెక్ చెల్లుతుందో లేదో? మురళీ నాయక్‌ తల్లితండ్రులే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories