విశాఖ స్టీల్ ప్లాంట్ లో జూన్ – 8 న జరిగిన ఘోర ప్రమాదం 9 మంది ప్రాణాలను బలికొంది. అధికార పార్టీ నేతల నుంచి ప్రభుత్వ పెద్దల వరకు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంటూ ప్రకటనలు చేసారు. ఇక నేడు విశాఖ పర్యటనకు వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాధిత కుటుంబాలను పలకరించారు, అలాగే గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
అయితే నిన్న మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ సైతం ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఉద్యోగులను పరామర్శించారు. అలాగే ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సాయం, ఉపాధి అవకాశం అందిస్తామని హామీ ఇచ్చారు.
అందుకు తగ్గట్టే ఇచ్చిన మాట ప్రకారం 24 గంటలు గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కింద మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా బాధిత కుటుంబాల కోసం తక్షణ చర్యలు చేపట్టింది.
ఇక నేడు జగన్ చేసిన ఈ పరామర్శల యాత్రలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. ఆపదలో ఉన్న కుటుంబాలకు మేమున్నాం అనే భరోసా, మాది బాధ్యత అనే ఒక ధైర్యం కల్పించడమే ప్రభుత్వ బాధ్యత. అటువంటి బాధ్యతను కూటమి ప్రభుత్వం నిర్వర్తిస్తున్నప్పటికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆ సాయాన్ని ‘బోడి’ అంటూ కించపరచడం అత్యంత హీనమైన చర్య అవుతుంది.
మంత్రి లోకేష్ స్టీల్ ప్లాంట్ కార్మికుల పట్ల మానవత్వం లేకుండా ప్రవర్తించారు అంటూ మండిపడ్డ జగన్, ప్రభుత్వ చేసిన తక్షణ సాయాన్ని, చేస్తాం అంటూ ప్రకటించిన హామీని బోడి అనే చిన్న పదం తో కించపరిచేసారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం వారి హక్కు అని, రూల్ ప్రకారం వారికీ రావాల్సింది ఇచ్చి ప్రభుత్వం దానికి సాయం అంటూ పేరు పెట్టుకుంటుందని,
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన ఆర్థిక భరోసాకు అదనంగా మరో కోటి రూపాయలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు జగన్. అలాగే ఒకవేళ ప్రభుత్వం ఆ సాయం అందించకపోతే కార్మికులు ఎవ్వరు అధైర్యపడొద్దని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాధిత కుటుంబాలకు ఆ ఆర్థిక సాయం అందిస్తామంటూ ప్రకటించారు.
అయితే జగన్ కార్మికుల తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యడం తప్పు కాదు, అలా అని చేసిన సాయాన్ని గుర్తించకుండా దాన్ని బోడి అంటూ వ్యాఖ్యానించడం అవమానించడం కిందకే వస్తుందిగా. ఇక ఎప్పుడో వైసీపీ అధికారంలోకి వస్తుందని అప్పటి వరకు వారు జగన్ ప్రకటించిన సాయం కోసం ఎదురుచూస్తూ ఉండాల్సిందేనా.?
నిజంగా జగన్ కు చిత్తశుద్ధి ఉంటే, కార్మిక కుటుంబాల పట్ల సానుభూతి ఉంటే వైసీపీ పార్టీ తరుపున ఆయా కుటుంబాలకు సాయం అందించవచ్చుగా. అవసరమైన సమయంలో చేసే దాన్ని సాయం అంటారు మరి అవకాశం వచ్చినప్పుడు చేస్తాం అనేదాన్ని ఏమనాలి.? తప్పించుకోవడం అనాలా.? రాజకీయాలు చేయడం అని భావించాలా.?






