సౌమ్యుడు, అత్యంత సన్నిహితుడని సర్టిఫై చేసిందెవరు?

ys_jagan_vijayasaireddy

ఏడాది క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నెల్లూరు నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన విజయసాయి రెడ్డిని ప్రజలకు పరిచయం చేస్తూ, “సాయన్న మంచివాడు, చాలా సౌమ్యుడు, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా..” అంటూ జగన్‌ సర్టిఫై చేశారు.

ADVERTISEMENT

అదే జగన్‌ నేడు విజయసాయి రెడ్డి గురించి ఏమన్నారంటే, “వైసీపీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరని, తనకు మరోసారి రాజ్యసభ అవకాశం ఉందని గ్రహించిన విజయసాయి రెడ్డి ఇంకా మూడేళ్ళు పదవీకాలం మిగిలి ఉండగానే కూటమికి, చంద్రబాబు నాయుడుకి మేలు జరుగుతుందని తెలిసి ఉన్నా ప్రలోభాలకు లొంగిపోయి తన సీటుని అమ్మేసుకున్నారు. మద్యం కుంభకోణం గురించి అటువంటి వ్యక్తి ఇచ్చే వాంగ్మూలాలకు విలువేముంటుంది?” అని అన్నారు.

తాను స్వయంగా సర్టిఫై చేసిన విజయసాయి రెడ్డిని జగన్‌ ఇప్పుడు దుష్టుడు, మోసగాడు, నమ్మకద్రోహి అని తేల్చేశారు.

ఎందువల్ల అంటే, జగన్‌ ప్రధాన సూత్రధారిగా ఉన్న మద్యం కుంభకోణం కేసులో ప్రతీ ఒక్కరినీ బట్టలూడదీసి చట్టం ముందు నిలబెట్టేందుకు సహకరిస్తానని విజయసాయి రెడ్డి శపధం చేశారు కనుక!

ఆయన మూడేళ్ళ పదవీ కాలం ఉండగానే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి ఆ సీటుని కూటమికి అమ్ముకున్నారని జగన్‌ చేసిన ఆరోపణ చాలా హాస్యాస్పదంగా ఉంది.

అక్రమాస్తుల కేసులో జగన్‌తో పాటు జైలుకి వెళ్ళి వచ్చిన విజయసాయి రెడ్డికి డబ్బుకి కరువే లేదు. అందువల్లే శాంతి వంటి వారికి కోట్ల రూపాయలు ఇచ్చారు. కనీసం డజను డజనుకు పైగా కేసులలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి న్యాయపోరాటాలు చేస్తున్నారు.

ఇప్పుడు జగన్‌ ఏవిదంగా ఆయనని దుష్టుడు, నమ్మకద్రోహి అని నిందిస్తున్నారో, విజయసాయి రెడ్డి కూడా అదేవిదంగా జగన్‌ని నిందిస్తూనే పార్టీని వీడారు.

కనుక ఇద్దరు దుష్టులు, నమ్మక ద్రోహుల మద్య స్నేహం, బంధం ముగిస్తే అది ఏవిదంగా ఉంటుందో వారి నోటితో వారే చెప్పుకుంటున్నారు కదా?

నిజానికి మద్యం కుంభకోణం కేసు అణుబాంబులా విస్పోటనం చెందబోతోందని విజయసాయి రెడ్డి ముందుగా పసిగట్టి, ఈ కేసు నుంచి ‘ఉపశమన హామీ’ పొందినందునే పదవికి, పార్టీకి రాజీనామా చేసి ఆ కేసులో ప్రభుత్వానికి సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. జగన్‌ మాటలు కూడా అలాగే ఉన్నాయి.

అలనాడు విభీషణుడు శ్రీరాముడికి తోడ్పడి రావణుడి వధ జరిపించినట్లే, ఈ కేసులో తన బట్టలూడదీయించి, అరెస్ట్‌ చేసి జైలుకి పంపేందుకు విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడుకి తోడ్పడుతున్నరన్నట్లు జగన్‌ మాటలున్నాయి. అందువల్లే విజయసాయి రెడ్డి ‘కాండక్ట్ సర్టిఫికేట్’ జగన్‌ రెడ్‌ ఇంకుతో వ్రాసేశారనుకోవచ్చు.

కానీ మద్యం కుంభకోణం కేసు న్యాయస్థానాలు విచారణ జరిపి ఈ కేసులో జగన్‌ పాత్ర ఏమిటో నిర్ధారిస్తాయి తప్ప జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని సొంత మీడియా ఎదుట వాదించేస్తే నిజాలు అబద్దాలు అయిపోవు. కేసులు మాఫీ అయిపోవు కదా?

ADVERTISEMENT
Latest Stories