ఏపీ సిఎం జగన్ ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చిన వెంటనే నేడు విజయవాడ ఇందిరా స్టేడియంలో దాదాపు 8,000 మంది పార్టీ శ్రేణులతో సమావేశం అవుతుండటం ఆసక్తికరంగా ఉంది.
త్వరలో జరుగబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేసేందుకే ఈ సమావేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. అంటే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నట్లు భావించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2024 మార్చి-ఏప్రిల్ నెలల్లో జరిగే అవకాశం ఉంది. అంటే మరో 5-6 నెలల సమయం ఉందన్న మాట! కానీ జగన్ ఢిల్లీ వెళ్ళి తిరిగి రాగానే ఈ సమావేశం నిర్వహిస్తుండటంతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారా?అనే సందేహం కలుగుతోంది.
ఎందుకంటే 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. నేడో రేపో విడుదలవుతాయి. కనుక వాటితో పాటు ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు జగన్ ప్రభుత్వానికి ఇంకా అవకాశం ఉంది.
ఒక్క అభివృద్ధి తప్ప మిగిలిన అన్ని విషయాలలో జగన్ కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఫార్ములాలనే ఫాలో అయిపోతున్నారు కనుక ముందస్తు విషయంలో కూడా కేసీఆర్ని ఫాలో అవ్వాలనుకొంటే ఆశ్చర్యం లేదు.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టిడిపికి అందుబాటులో లేకపోవడంతో పార్టీ చాలా బలహీనంగా ఉంది. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన యువగళం పాదయాత్ర కూడా నిలిచిపోయింది కూడా. చంద్రబాబు నాయుడుని విడిపించుకొనే ప్రయత్నాలలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజల మద్యకు వెళ్ళలేకపోతున్నారు. టిడిపి-జనసేనల మద్య సీట్ల సర్దుబాట్లు ఇంకా జరుగలేదు.
కనుక రాష్ట్రంలో వైసీపికి అనుకూల రాజకీయ పరిస్థితులున్నందున ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు జగన్ ఢిల్లీ పెద్దల అనుమతి తీసుకొని ఉండవచ్చు. బహుశః అందుకే నేడు హడావుడిగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం నేడే ప్రకటించకపోయినా అటువంటి సంకేతాలు ఇస్తారేమో?



