2019 ఏపీ శాసనసభ ఎన్నికలలో తెలంగాణ సిఎం కేసీఆర్ తనను ఏపీ సిఎం కుర్చీలో కూర్చోబెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే హైదరాబాద్ వెళ్ళి ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
ఆయన కూడా జగన్ను గట్టిగా హత్తుకొని ఆయన పట్ల తన ప్రేమను, అలాగే చంద్రబాబు నాయుడుని గద్దె దించేందుకు, జగన్ని గెలిపించేందుకు తెర వెనుక కుట్రలు చేశామని మీడియా సాక్షిగా లోకానికి తెలియజేశారు.
ఆనాడు కేసీఆర్ తెర వెనుక చక్రం తిప్పకపోయుంటే జగన్కు ఆ ఒక్క ఛాన్స్ కూడా దక్కేది కాదేమో?ఏనాటికైనా ఏపీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనే తన కలను కేసీఆర్ నెరవేర్చారని జగన్ అప్పుడే మరిచిపోయిన్నట్లున్నారు.
కేసీఆర్ తుంటి ఎముక మార్పిడికి శస్త్ర చికిత్స చేయించుకొని ప్రస్తుతం హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో ఉన్నారు. కానీ పరామర్శించలేదు. చంద్రబాబు నాయుడితో పోటీగా ఏపీలో వరద బాధితులను పరామర్శించాల్సి ఉంటుంది. కొత్తగా కనిపెట్టిన పొటాటోలనబడే ఉల్లిపాయాలను ప్రజలకు పంచిపెట్టాల్సి ఉంటుంది. కనుక ఆయన స్వయంగా కేసీఆర్మ్ని పరామర్శించడానికి వెళ్ళలేకపోయి ఉండొచ్చు.
కానీ విజయ సాయిరెడ్డిని లేదా సకల శాఖమంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డినో లేదా కోడిగుడ్డు మంత్రినో లేదా గంట, అరగంట కోసం ఎవరైనా మంత్రులనో హైదరాబాద్ పంపించి కేసీఆర్ని పరామర్శించవచ్చు కదా? కానీ విజయ సాయిరెడ్డి మాత్రం ఓ ట్వీట్ వేసి విచారం వ్యక్తం చేశారు.
సరే! కేసీఆర్ గద్దె దిగిపోయారు కనుక ఆయన మనకు ఇక ఉపయోగపడరనో లేదా ప్రతిపక్షాలకు, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయనో వైసీపిలో ఎవరూ హైదరాబాద్ వెళ్ళి ఆయనని పరామర్శించలేదని సర్ధి చెప్పుకోవచ్చు.
కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి ఓ ఫోన్ చేసి అభినందనలు తెలుపవచ్చు కదా?ఆయన మనకి స్నేహహస్తం అందించారని సొంత మీడియాలో వ్రాసుకొన్నప్పుడు, ఓసారి వెళ్ళి పలకరిస్తే మనం కూడా స్నేహహస్తం అందుకొన్నట్లు చెప్పుకోవచ్చు కదా?ముఖ్యంగా రాష్ట్ర విభజన సమస్యలను సమరశ్యంగా పరిష్కరించుకొనేందుకు మరోసారి ప్రయత్నించవచ్చు కదా? కానీ ఓ అభిననందనలు ట్వీటేసి ఊరుకొన్నారు.
ఆనాడు కేసీఆర్ వచ్చి తమను ఆదుకొన్నట్లు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి టిడిపిని ఆదుకొంటారని భయపడుతున్నందునే జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని తమ శత్రువుగా పరిగణిస్తున్నారా?రేవంత్ రెడ్డితో తమకు ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నప్పుడు, ఆయన శత్రువు కేసీఆర్ మనకి మిత్రుడవుతారని జగన్మోహన్ రెడ్డి మరిచిపోతే ఎలా?
ఇంకా ఆలస్యం చేస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళి కేసీఆర్ని పరామర్శించేసే ప్రమాదం ఉంటుంది. కనుక వైసీపి ఇంకా ఆలోచించడం, ఆలస్యం చేయడం మంచిది కాదేమో?




