వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పాలిట ఒక బొమ్మాళిలా మారిందా.? తాజాగా ఉండవల్లి రైతులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ జరిపిన సమావేశాలు గమనిస్తే అవుననే సందేహమే వ్యక్తమవుతోంది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణ కు అడ్డుపుల్లలు వేసేందుకు నాటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డిని రంగంలోకి దింపింది వైసీపీ. దీనితో ఆయన రాజధాని నిర్మాణాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలలో కేసులు వేసి ప్రభుత్వ భూసమీకరణకు అడ్డంకులు సృష్టించారు.
అయితే సరిగ్గా ఇప్పుడు కూడా వైసీపీ అదే వ్యూహంతో ముందుకెళ్లేందుకు సిద్దమయినట్టు తాజా పరిణామాలను గమనిస్తే ఇట్టే అర్ధమవుతుంది. రాజధాని అమరావతి ముఖ ద్వారంగా ఉండే ఉండవల్లి భూములను రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి ఇచ్చేది లేదు అంటూ అక్కడ కొంతమంది స్థానిక రైతులు కూటమి కి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు.
అయితే వారందరిని తన తాడేపల్లి ప్యాలస్ కి పిలిపించుకున్న జగన్ వారందరితో కాసేపు సమావేశమై భవిష్యత్ తో వైసీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతులను నుంచి తీసుకుంటున్న భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తామంటూ హామీ ఇచ్చారు.
అయితే గతంలో కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇదే తరహాలో అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకించిన రైతు కుటుంబాలకు ఇటువంటి హామీలే ఇచ్చారు. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చాకా కనీసం వారి సమస్యలను వినేందుకు కూడా జగన్ సుముఖత చూపలేదు.
ఇక గత వైసీపీ ఐదేళ్ల సమయంలో దాదాపు అమరావతి రైతు కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద తమకు తమ భూములకు న్యాయం చెయ్యాలని, అమరావతిని అభివృద్ధి చేసి, తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన కౌలు సక్రమంగా చెల్లించాలంటూ వైసీపీ ప్రభుతావనికి వ్యతిరేకంగా న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ అలుపెరగని పోరాటం చేసారు.
కానీ నాడు వారి పోరాటాలు ఫలించలేదు కానీ వైసీపీ కి మాత్రం ఆ రైతు కుటుంబాల కన్నీటి ఉసురు తగిలింది. అలాగే రాజధాని నిర్మాణం కోసం బాబు సేకరించిన భూములను సీఎం హోదాలో జగన్ పేదలకు పంచుతూ అక్కడ కూడా రాజకీయమే చేసారు. ఇలా జగన్ ఏపీ రాజధాని విధ్వంసానికి ఎప్పటికప్పుడు మూడు రాజధానులు అంటూ, విశాఖే రాజధాని అంటూ, మావిగన్ అంటూ మాటలు మారుస్తూ మడాలు తిప్పుతున్నారు.
ఒక ప్రభుత్వాన్ని నమ్మి సామాన్య రైతు తమ విలువైన భూమిని ఇచ్చేందుకు సిద్దపడుతుంటే ఇలా జగన్ నేను అధికారంలోకి వస్తే తిరిగి మీ భూములు మీకిచ్చేస్తా, రాజధానిని మార్చేస్తా, నిర్మాణాలను ఆపేస్తా అంటూ ప్రకటనలు చేస్తుంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం పూర్తవుతుందా.?
నాడు ఆర్కే ను అడ్డుపెట్టుకుని అమరావతి పై నడిపిన రాజకీయాన్ని ఇప్పుడు జగన్ ఎవరిని అడ్డుపెట్టుకుని చేస్తున్నారు. నాడు జగన్ ఆదేశాలకు కోసం ఆర్కే చేసిన విధ్వంశం ఆయన రాజకీయ భవిష్యత్ ని బలి తీసుకుంది. మరి ఇప్పుడు ఆ బలిపీఠం ఎక్కేందుకు ఆత్రుత పడుతున్న ఆ నేత ఆర్కే స్థానంలో ఎన్నికైన మంగళగిరి వైసీపీ ఇంచార్జ్ వేమారెడ్డా.?




