దుర్యోధనుడికి శకుని.. మావిగన్‌కి ఎవరు?

Jagan Mavigun Political Debate

మహాభారతంలో ఎల్లప్పుడూ దుర్యోధనుడి వెన్నంటి ఉంటూ తప్పుడు సలహాలు ఇస్తూ చివరకు మొత్తం కౌరవ వంశాన్ని నాశనం చేసిన ఘనుడు ఎవరు? అంటే శకుని అని అందరూ టక్కున చెప్తారు.

2019 ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ, 2024 ఎన్నికలలో దారుణంగా ఓడిపోయినప్పుడు జగన్‌ పాలిట శకుని ఎవరు? అనే చర్చ జోరుగా సాగింది. అప్పుడు పలువురి పేర్లు వినబడ్డాయి కూడా.

ADVERTISEMENT

అప్పుడంటే సరే… కానీ ఇప్పుడు కూడా వైసీపీని తుడిచిపెట్టేసే “మావిగన్‌” సలహా ఆయనకు ఎవరు ఇచ్చారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్‌ తాజా మీడియా సమావేశంలో “మావిగన్‌”తో వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రతిపాదనకు బలమైన కారణాలు లేదా ప్రజలను ఒప్పించగల వాదనలు మాత్రం చెప్పనే లేదు.

అమరావతి నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని, అందుకే వ్యతిరేకిస్తున్నామని జగన్‌ చేస్తున్న వాదన దానిని వ్యతిరేకించడానికి సమంజసంగా కనిపించడం లేదు.

ఒకవేళ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని జగన్‌ భావిస్తున్నట్లయితే అమరావతిని రాజధానిగానే కొనసాగిస్తూ, ఈ అవినీతి, అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని చెప్తే సహేతుకంగా ఉండేది.

కానీ వచ్చే ఎన్నికలు అమరావతి – మావిగన్‌ మధ్య పోటీగా ఉంటాయని జగన్‌ చెప్పడం వైసీపీకి రాజకీయంగా సమాధి కట్టేదే. కనుక ఆయనకు ఈ సలహా ఎవరు ఇచ్చారనే ప్రశ్న మళ్ళీ వినిపిస్తోంది.

మూడు రాజధానులు, విశాఖ రాజధాని తర్వాత ఇప్పుడు చేస్తున్న ఈ మావిగన్‌ ప్రతిపాదన గురించి ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అసలు ఏమనుకుంటున్నారు? అని జగన్‌ అభిప్రాయ సేకరణ చేసి ఉంటే, బహుశా ఇటువంటి సాహసం చేసేవారు కారేమో?

అయితే జగన్‌ అంగీకరించకపోయినా ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నిర్మాణం ఆగదని సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి కూడా.

అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి, అందిస్తున్న సహకారాన్ని జగన్‌ గ్రహించినట్లు లేదు. లేదా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నట్లున్నారు. రాష్ట్ర ప్రజలకు అర్థమైన ఇంత చిన్న విషయం జగన్‌కి అర్థం కాలేదనుకోలేము.

ఇప్పటి నుంచే దీనిని వచ్చే ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చాలనుకోవడం ద్వారా జగన్‌ చేజేతులా ప్రజలను దూరం చేసుకున్నట్లవుతోంది. కనుక ముందే చెప్పుకున్నట్లు జగన్‌ చేత మావిగన్‌ పాట పాడిస్తున్న ఆ శకుని పేరేమిటి? మావిగన్‌తో జగన్‌ని, వైసీపీని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న ఆ శకుని ఎవరు? వైసీపీ నేతలే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories