రాష్ట్రంలో మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రయివేట్ పరం చేస్తుందని మీడియా ముందుకొచ్చిన వైస్ జగన్ తన ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయలేకపోయామని చెప్పుకొచ్చారు.
అయితే ఐదేళ్ల కాలపరిమితిలో కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణమే చేపట్టలేకపోయిన వైస్ జగన్ 2014 – 2019 మధ్య రాష్ట్ర రాజధానిగా అమరావతిని పూర్తి చేయలేకపోయారు అంటూ నాటి టీడీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు ను విమర్శిస్తూ వస్తున్నారు.
నాటి రాష్ట్ర విభజన, రాజధాని ప్రాంత ఎంపిక, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, అమరావతి రైతుల భూ సమీకరణ, రాజధాని డిజైన్ల ఎంపిక అన్ని కలగలిపి టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల సమయాన్ని మూడేళ్లకు కుదించింది.
ఆ నిర్దిష్ట కాలపరిమితిలోనే తాత్కాలిక భవనాల పేరుతో హై కోర్ట్ నిర్మాణం పూర్తి చేసింది, శాసన సభను అందుబాటులోకి తెచ్చింది, అలాగే ప్రభుత్వాధికారుల వసతి గృహాల నుంచి రాజధాని రైతుల కు ఫ్లాట్ ల పంపకం వరకు నాటి టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది.
అయితే నాటి ఐదేళ్ల బాబు కృషిని, ప్రభుత్వ కష్టాన్ని, కార్మికుల శ్రమను, అమరావతి రైతుల త్యాగాన్ని, ఏపీ ప్రజల భవిష్యత్ ఆశలను, కలలను వైస్ జగన్ తన ప్రభుత్వ హయాంలో ఒకే ఒక్క నిర్ణయంతో మూడు ముక్కలు చేసారు.
దానికి తోడు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతిలో ఒక్క ఇటుక పేర్చలేకపోయిన వైస్ జగన్ రాజధాని పై నిత్యం అసత్య ప్రచారాలు చేస్తూ రెచ్చిపోయారు, అలాగే నిర్మాణాలను కూల్చేస్తూ రెచ్చకొట్టారు. అటువంటి జగన్ నేడు తమకు మెడికల్ కాలేజీల నిర్మాణాలకు సమయం చాల్లేదంటూ చావు కబురు చల్లగా చెప్పారు.
ఐదేళ్ల సమయంలో కేవలం నాలుగు భవనాల నిర్మాణానికే సమయం చాలని వైసీపీ ప్రభుత్వానికి మూడేళ్ళ సమయంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అమరావతి నిర్మాణాల గురించి విమర్శించే నైతిక హక్కు ఉందా.? అనేది వైసీపీ గ్రహించాలి. దీనితో జగన్ మొదలు పెట్టిన మెడికల్ రాజకీయాలకు అమరావతి లాజిక్స్ ఏ సరైన వాక్సిన్ అనేలా కనిపిస్తుంది.




