ఇక తన దృష్టి సినిమాలపై కాదు, రాజకీయాల పైనే అంటూ స్పష్టం చేసిన ‘జనసేన’ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్, అనుకున్న విధంగానే కార్యకర్తలతో సమావేశం అవుతూ చర్చలు జరుపుతున్నారు. తనపై నమ్మకం ఉంచండి, 25 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధం కండి, ఖచ్చితంగా తెలంగాణాలో కూడా వచ్చే ఎన్నికలలో బోణీ కొడతాం అనే నమ్మకాన్ని, స్థైర్యాన్ని ఇస్తున్నారు. అలాగే అభిమానులు, కార్యకర్తలు కూడా ప్రస్తుతం పవన్ కు అనుకూలంగానే ఉన్నారు.
మరి బయట వ్యక్తులు ఇంతలా అభిమానం చూపిస్తుంటే, పవన్ కు తన సొంతం కాంపౌండ్ అయిన ‘మెగా’ ఫ్యామిలీ నుండి అంతగా సహకారం అందడం లేదా? అంటే పవన్ మాటల్లో చెప్పాలంటే… నేను ఒంటరిని…. నా వెనుక ఎవరు లేరు. ముఖ్యంగా తన సోదరుడు చిరంజీవి కూడా లేరు అంటూ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. వాస్తవాన్ని పరిశీలిస్తే… నిజంగా మెగా ఫ్యామిలీ అంతా పవన్ కు ఏ మాత్రం సహకరించడం లేదా? అంటే కాదనే చెప్పాలి.
తదుపరి మెగాస్టార్ గా తండ్రి అడుగుజాడల్లో పయనిస్తున్న రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచిన భావం పవన్ కు అనుకూలమే. అలాగే మరో సోదరుడు తనయుడు వరుణ్ తేజ్, తన బాబాయ్ కు శుభాకాంక్షలు చెప్పగా, మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా పవన్ కు అనుకూలంగా స్పందించారు. మరి ఇంతమంది మెగా ఫ్యామిలీ నుండి స్పందిస్తే…. తనకు సహకరించడం లేదని పవన్ ఎందుకు చెప్తున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
అల్లు ఫ్యామిలీని పక్కన పెడితే, మిగిలిన మెగా హీరోలంతా కూడా పవన్ కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెన్నుదన్నుగా ఉన్నవారే. అయినప్పటికీ తన రాజకీయ జీవితం వలన మెగా ఫ్యామిలీ ఇతర హీరోలకు వ్యక్తిగతంగా గానీ, ప్రొఫెషనల్ గా గానీ ఎలాంటి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతోనే తాను ‘ఏక్ నిరంజన్’ అన్న సింబల్ ను ప్రజెంట్ చేసుకుంటున్నారు. ఇందులో పవన్ కు ఎదురుదెబ్బలు తగిలితే, ఆయా హీరోల కెరీర్లు సేఫ్ గా ఉండే విధంగా పవన్ అడుగులు పడుతున్నాయి.
అయితే ఇందులో పవన్ కు లాభించే అంశం లేకపోలేదు. ఒక ఒకవేళ రేపు ‘జనసేన’ క్లిక్ అయితే ఆ మొత్తం క్రెడిట్ అంతా ఒక్క పవన్ కళ్యాణ్ కే వెళ్తుంది తప్ప మరొకరికి కాదని చెప్పాలి. అప్పుడు ఇంకెంతమంది హీరోలు వచ్చినా “జనసేన”కు అసలు హీరో, కధానాయకుడు పవన్ కళ్యాణ్ అన్న పేరు ఒక్కటే చరిత్రలో నిలబడుతుంది. అయితే అలా జరగడం నల్లేరు పైన నడకేమి కాదు. అందుకే తన లక్ష్య సాధన కోసం 25 ఏళ్ళగా ముందుగానే గమ్యస్థానాన్ని పెట్టుకున్నారు.



