విశాఖపట్నంలోని పెందుర్తి మండలంలో ఇటీవల ఓ ఎస్సీ మహిళపై టీడీపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా గతంలో దళితులపై జరిగిన కారంచేడు, చుండూరు ఘటనలను పవన్ గుర్తుచేశారు.
” నేను నేరుగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటే అధికారులపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. అందుకే అలా జరగకుండా బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడండి”, అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అయితే ఇప్పటికే ఆ దాడికి బాధ్యులైన వారిపై పెందుర్తి పోలీసులు ఎస్సీ, ఎస్టీ ఆస్ట్రోసిటీస్ కేసు నమోదు చేసారు.
దాడిలో పాల్గొన్న ఏడుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. క్రిస్మస్ సెలవుల అనంతరం కోర్టులో వారిని ప్రవేశ పెట్టబోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగా ఏంచెయ్యమంటున్నారో అర్ధం కాదు. ఇలాంటి సందర్భాలలో రూల్స్ ప్రకారం ఏంచెయ్యాలో స్థానిక పోలీసులు అది ఆల్రెడీ చేసారు.
తప్పు, ఒప్పులు ఇక నిర్ణయించాల్సింది కోర్టు. ఆలస్యంగా స్పందించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో మరి! మరో వైపు దళిత మహిళ చీర, జాకెట్టు చించేలా టీడీపీ నేతలను ఉసిగొలిపే హీనస్థితికి చంద్రబాబు దిగజారారని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు.



