ఏపీలో బీజేపీ, జనసేనల మద్య సాంకేతికంగా మాత్రమే పొత్తు ఉంది కానీ ఈ నాలుగున్నరేళ్ళలో రెండు పార్టీలు ఒక్కసారి కూడా కలిసి పనిచేయలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించడంతో బీజేపీ, జనసేనల మద్య దూరం మరింత పెరిగిన్నట్లయింది.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటనపై కూడా బీజేపీ అధిష్టానం స్పందించకపోవడంతో రెండు పార్టీ శ్రేణులకి, రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. అయినా బీజేపీ పట్టించుకోకపోవడం గమనిస్తే జనసేనతో పొత్తుపై ఆసక్తి కోల్పోయిన్నట్లు భావించవచ్చు.
అలాగని బీజేపీ, జనసేన నేతలెవరూ పరస్పరం విమర్శించుకోవడం లేదు. అలాగని పొత్తులు పునరుద్దరించుకొనేందుకు ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. కనుక ఏపీలో బీజేపీ-జనసేనల పొత్తు విషయంలో ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఈ నేపధ్యంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎంపీ కె లక్ష్మణ్ కలిసి నిన్న హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి, తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఈయవలసిందిగా కోరడం విశేషం.
తెలంగాణలో బీజేపీతో సంబంధం లేకుండా జనసేన 32 స్థానాల నుంచి పోటీ చేసేందుకు సిద్దం అవుతోంది. మరోపక్క బీజేపీ అభ్యర్ధుల జాబితా కూడా ఖరారు అయ్యిన్నట్లు తెలుస్తోంది. కనుక రెండు పార్టీల మద్య పొత్తులపై చర్చలకు సమయం మించిపోయిందని అర్దమవుతోంది.
అదీగాక ఏపీలో జనసేన పట్ల బీజేపీ వైఖరి ఏమిటో తెలియకుండా తెలంగాణలో బీజేపీతో పొత్తులు పెట్టుకోవలసిన అవసరం పవన్ కళ్యాణ్కు లేదు. కనుక తెలంగాణ బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకొన్న తర్వాత తన అభిప్రాయం తెలియజేస్తామని పవన్ కళ్యాణ్ వారికి చెప్పి పంపించిన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ తెలంగాణలో జనసేన మద్దతు కావాలనుకొంటే, ముందుగా ఏపీలో జనసేనతో పొత్తుల వ్యవహారం కూడా తేలాలి. అవి తేలాలంటే, టిడిపితో కలిసి పనిచేయాలో వద్దో బీజేపీ అధిష్టానం తేల్చుకోవలసి ఉంటుంది. కలిసి పనిచేయాలనుకొంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని విముక్తి కల్పించాల్సి ఉంటుంది.
ఒకవేళ టిడిపిని వద్దనుకొంటే, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని వద్దనుకోగలరు. కానీ పవన్ కళ్యాణ్ తొందరపాటుతో అనాలోచిత నిర్ణయాలు తీసుకొనే వ్యక్తి కాదు కనుక తెలంగాణ బీజేపీకి ఏమని సమాధానం చెపుతారనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది.




