గ్యాప్ వచ్చిందా..? తీసుకున్నారా…బ్రో?

Pawan Kalyan

ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన మాటలలో ఉంటే చాలదు చేతలలో కూడా చూపించాలి అని తెలుసుకోకనే గత ఎన్నికలలో బోల్తా పడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గెలిచినోడి మాటే ఈ సమాజం వింటుంది, నమ్ముతుంది అనేది సినిమా డైలాగ్ కాదు వాస్తవంలో కూడా అదే నిజం. పవన్ కూడా తన ఆశయాలను వల్లెవేస్తే సరిపోదు. వాటిని సాధించే మార్గాలను శోధించాలి.

వారాహి యాత్ర మొదలుపెట్టి వైసీపీ ప్రభుత్వం పై విమర్శల మోత మోగించి వైసీపీ, టీడీపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో మరో పార్టీ ఉంది అని ప్రజలు గుర్తించేలా, అధికార పార్టీ భయపడేలా, పార్టీ అభిమానులు కూడా ఆశ్చర్య పడేలా చేసిన పవన్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యిపోయారు. వారాహి యాత్రతో పార్టీకి వచ్చిన అంతటి క్రేజ్ ను పవన్ నిలబెట్టుకోవడంలో, కొనసాగించడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.

ADVERTISEMENT

గోదావరి జిల్లాలో పార్టీ అందుకున్న స్పీడ్ ను కొంచెంకొంచెంగా తగ్గించుకుంటూ విశాఖ, కృష్ణా జిల్లాల యాత్రలు కొనసాగాయి. ఆ తరువాత వారాహి ఊసే లేకుండా పోయింది. అటు సినిమాలు చేయక ఇటు రాజకీయ వేదికలలో కనపడకపోవడంతో పవన్ అభిమానులు “గ్యాప్ వచ్చిందా సార్…, లేక గ్యాప్ తీసుకున్నారా..?” అంటూ నిట్టూరుస్తున్నారు.

అటు ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ ఇంచార్జ్ లను మారుస్తూ కొత్త వారిని ఎంపిక చేస్తూ ఎవరి నియోజకవర్గాన్నివారికి చూపిస్తూ గ్రౌండ్ స్థాయి పనులు మొదలుపెట్టుకోమని ఆదేశాలు జారీ చేస్తుంది. అలాగే మిత్ర పార్టీ అయిన టీడీపీ కూడా బాబు అరెస్టు నుంచి కోలుకొని నిత్యం ప్రజాక్షేత్రంలో నిలబడుతూ అధికార పార్టీ వేస్తున్న తప్పటడుగులు తమకు అనుకూలంగా మార్చుకుంటూ గెలుపు గుర్రాలను నిర్ణయించే పనిలో బిజీగా ఉన్నారు.

ఇక పొత్తులో ఉన్న బీజేపీ పార్టీ ఎంత శ్రమించిన ఫలితం లేదు అనే చేదు నిజాన్ని అంగీకరించి చివరి నిముషంలో ఏదోఒక పార్టీ తో కలిసి వెళ్ళడానికి సిద్ధపడినట్లు ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా తన వనవాసాన్ని వీడి ప్రజాక్షేత్రంలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇలా ఎవరి స్టాటజీలు వాళ్ళు ఫాలో అవుతూ నిత్యం ఎదో ఒక వార్తతో అటు మీడియాలో ఇటు ప్రజలలో ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నాలుగున్నరేళ్ళు చేసిన జనసేన పోరాటాలను, కార్యకర్తల త్యాగాలను పవన్ తన మోనంతో అర్థరహితం చేస్తున్నారు.

పార్టీకి ఎంతో కీలకమైన ఈ సమయంలో జనసేన పార్టీ పేరు కానీ, పవన్ కళ్యాణ్ ఊసు కానీ ఎక్కడ చర్చకు రావడం లేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ఇక ప్రతి నిమిషం రాజకీయ పార్టీలకు ఎంతో కీలకంగా మారుతుంది. ఇప్పటికి జనసేన పార్టీ రాజకీయ వేదికల మీద పవన్, నాదెండ్ల తప్ప మరో వ్యక్తి కనపడరు. జనసేన నాయకులను ప్రజలకు చేరువ చేయవల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ దే. పొత్తులో తమ పార్టీకి దక్కే స్థానాలెన్ని, అక్కడ నిలబడే అభ్యర్థి ఎవరు? ఆ స్థానంలో టీడీపీ శ్రేణుల మద్దతు తమ పార్టీకి దక్కుతుందా?

పొత్తులో తమ పార్టీ నేతలు త్యాగాలు చేయాల్సిన స్థానాలు ఏంటి? వారిని ఎలా ఒప్పించాలి? ఇలా ఎన్నో ప్రశ్నలకు పార్టీ అధినేత అయిన తనతో పాటుగా స్థానిక ప్రజలకు, ఆ పార్టీ నాయకుల నుండి కార్యకర్తల వరకు అందరికి తెలియాలి. అప్పుడే తమ ప్రాంతంలో అధికార పార్టీకి ప్రత్యర్థిగా నిలబడే బలమైన పార్టీ నేతను ఎంచుకునే అవకాశం ప్రజలకు వస్తుంది. అలాగే స్థానికంగా ఆ ప్రాంతం పై పట్టు సాధించే అవకాశం పార్టీ నేతలకు కలుగుతుంది.

ఇదంతా పవన్ కు తెలియంది కాదు. కానీ ప్రజారాజ్యం పార్టీ మిగిల్చిన చేదు అనుభవాల రీత్యా పవన్ ఆలోచనలు పరిధి దాటి ఉంటున్నాయి. దీనితో ఆలోచనలతోనే సగం సమయం వృధా అయిపోతుంది అనే విమర్శలు ఎదుర్కుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories