క్రికెట్లో టెస్ట్ మ్యాచ్, 20 ఓవర్ల వన్-డే మ్యాచ్ మద్య చాలా అంతరం ఉంటుంది. ఇప్పుడు అందరికీ ‘ఇన్స్టాంట్ సంతోషం’ కావాలి కనుక వన్-డే మ్యాచ్లకు మంచి ఆధరణ లభిస్తోంది. కానీ టెస్ట్ మ్యాచ్లలోనే ఆటగాళ్ళ అసలైన ప్రతిభ బయటపడుతుందని భావించేవారు, అది చూసి ఆనందించేవారు కోకొల్లలున్నారు.
వీటినే రాజకీయాలకు వర్తింపజేసి చూస్తే జగన్ ‘వన్డే ప్లేయర్’ కాగా పవన్ కళ్యాణ్ ‘టెస్ట్ ప్లేయర్’ అని చెప్పుకోవచ్చు. జగన్ ఎంత ఫాస్ట్గా క్రీజులోకి వచ్చారో అంతే వేగంగా క్లీన్ బౌల్డ్ అయ్యి వెళ్ళిపోయారు. కానీ అదనపు ప్లేయర్లా చాలా ఓపికగా అవకాశం కోసం ఎదురుచూసి, ఎటువంటి అంచనాలు లేకుండా తాపీగా బరిలో దిగిన పవన్ కళ్యాణ్ తన టీమ్ని గెలిపించుకొని ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడమే కాకుండా తర్వాత మరో భారీ ఇన్నింగ్స్ కోసం అప్పుడే రెడీ అవుతున్నారు.
అయితే ఆ ఇన్నింగ్ ఆంధ్రా లేదా తెలంగాణలో కాకుండా తమిళనాడు మొదలుపెట్టబోతుండటమే కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. అదీ.. బీజేపి తరపున ఫీల్డులోకి దిగుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు.
వచ్చే ఏడాది జరుగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో బీజేపి, అన్నాడీఎంకే పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాయి.
బీజేపి, అన్నాడీఎంకే పార్టీల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. పళనిస్వామి వంటి అనుభవజ్ఞుడు నేతృవటంలో దేశంలో అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్న ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే తమిళనాడుకి చాలా మేలు కలుగుతుందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
తమిళనాడులో బీజేపి, అన్నాడీఎంకే-అధికార డీఎంకే, మరో అరడజను పార్టీల మద్య జరుగబోతున్న ఆ మ్యాచ్తో జనసేనకు దాని అధినేత పవన్ కళ్యాణ్కు ఎటువంటి సంబంధమూ కనిపించదు. కానీ అ మ్యాచ్లో పవన్ కళ్యాణ్ ఆడబోతున్నట్లు ఈవిదంగా సంకేతాలు ఇస్తున్నారు.
‘జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతా.. ప్రధాని అవుతా.. గుణాత్మకమైన మార్పు తెస్తానంటూ’ కేసీఆర్ నానా హంగామా చేసి చివరికి సొంత రాష్ట్రంలోనే ఓడిపోయి ఫామ్హౌస్లో చతికిలపడిపోయారు. 175కి 175 రన్స్ కొట్టి మరో 25-30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తానని చెప్పిన జగన్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యారు.
కానీ పవన్ కళ్యాణ్ ఎటువంటి హడావుడీ చేయకుండా ఒక్కో లక్ష్యం సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ ‘టెస్ట్ మ్యాచ్ స్ట్రాటజీ’తో రాజకీయాలలో ముందుకు సాగుతున్నట్లు భావించవచ్చు.
టెస్ట్ మ్యాచ్లో ఆటగాళ్ళ ప్రతిభ, ఫలితాలు వెంటనే తెలియవు. కనుక వచ్చే ఏడాది ఈ మ్యాచ్ మొదలయ్యి ముగిసేవరకు ఎదురు చూడాల్సిందే.
కానీ తమిళనాడులో బీజేపి-అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి రాగలిగితే, పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరో మెట్టు పైకి ఎక్కినట్లే… జాతీయ రాజకీయాలలో ప్రస్థానం మొదలైన్నట్లే!






