తెలిసి తెలియని వాళ్ళు ఇస్తున్న ‘సినిమా రివ్యూ’లే తెలుగు సినిమాలను చంపేస్తున్నాయని పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే వెల్లడించిన సంఘటనలు ఉన్నాయి. పైరసీని మించిన నష్టం జరుగుతోందని వాపోయిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ప్రాక్టికల్ గా ఇది ఎంతవరకు నిజం? ప్రేక్షకులు రివ్యూలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారా? రివ్యూలు సరిగా రాకపోతే ఇక ఆ సినిమా పరిస్థితి అంతేనా? అంటే ఖచ్చితంగా ‘కాదు’ అని, ఈ ఏడాది పలు సినిమాలు నిరూపించాయి.
అల్లు అర్జున్ హీరోగా ఈ ఏడాది విడుదలైన ‘సరైనోడు’ సినిమాకు సినీ విశ్లేషకులు దారుణమైన రేటింగ్స్ తో స్వాగతం పలికారు. అయితే, ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను సాధించింది. అలాగే ఇటీవల విడుదలైన ‘జనతా గ్యారేజ్’ విషయంలో అదే కధ పునరావృతం అయ్యింది. మళ్ళీ ‘సరైనోడు’ స్టోరీనే రిపీట్ చేస్తూ, ‘జనతా గ్యారేజ్’ కూడా కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం పెద్ద సినిమాలకే పరిమితం అవుతోందా? మరి చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? అంటే ఆ ప్రభావం కూడా అంతంతమాత్రమేనని చెప్పకతప్పదు.
చిన్న సినిమాలలో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం, డబ్బింగ్ రూపంలో వచ్చిన ‘బిచ్చగాడు.’ అసలు ఈ సినిమాకు కొంతమంది రివ్యూలు కూడా ఇవ్వలేదు. మరి ‘బిచ్చగాడు’ కోట్లు ఎలా కొల్లగొట్టింది అంటే… కేవలం ‘మౌత్ టాక్’ వలనే. అవును… నాడు సమ్మర్లో ‘సరైనోడు’ రికార్డులు కొల్లగొట్టినా… నేడు ‘జనతా గ్యారేజ్’ దుమ్ము దులుపుతున్నా… అది కేవలం మౌత్ టాక్ వలనే సాధ్యమైంది. సాంకేతిక పరిజ్ఞానం ఈ స్థాయిలో పెరిగినప్పటికీ, ‘మౌత్ టాక్’కు ఉన్న పవర్ ఏంటో చాటి చెప్పిన చిత్రాలు ఇవి.
‘సినీ ప్రేక్షకులపై రివ్యూల ప్రభావం ఖచ్చితంగా లేదు’ అని చెప్పలేం గానీ, ఆ ప్రభావం ఒక వర్గం వారికి మాత్రమే పరిమితం. ఈ రివ్యూల ప్రభావం ఎక్కువవుతున్న మాట వాస్తవమే గానీ, ‘మౌత్ టాక్’ బాగుంటే… సినిమాల ప్రభంజనాన్ని అడ్డుకునే శక్తి ‘రివ్యూ’లకు లేదు అన్నది నిరూపణ అవుతోంది. కాబట్టి దర్శకనిర్మాతలు రివ్యూలపై మండిపడే కన్నా… సినిమాలను ప్రేక్షకులకు మెచ్చేలా తెరకెక్కించాంలన్నది ఆఖరి మాట.



