తాడేపల్లిగూడెంలో టిడిపి, జనసేనల జెండా సభ విజయవంతం అయ్యిందని వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేల కడుపు మంటతో రగిలిపోతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల చేస్తున్న మూకుమ్మడి దాడులు చూస్తే అర్దమవుతుంది.
అయితే ఈ సభలో తమ పార్టీలను ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలో చెప్పలేదని, తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పనే లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇవి చెప్పకుండా పవన్ కళ్యాణ్ ఆవేశంతో ముఖ్యమంత్రి జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారని, చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయాలనే మళ్ళీ చెపుతూ విలువైన సభను వృధా చేసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అలాగే పవన్ కళ్యాణ్ తన పార్టీని తక్కువ చేసుకొని చూపుకోవడం, నాకు ఎవరి సలహాలు అక్కరలేదని చెప్పడం కూడా చాలా తప్పని, ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడినా మాటలతో కాపులను చాలా బాధపడ్డారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఈ జెండా సభ నిజంగానే ఇంత అనాలోచితంగా, ఇంత అపరిపక్వంగా సాగిందా?జెండా సభతో టిడిపి, జనసేనలు ప్రజలకు బలమైన సందేశం ఇవ్వడంలో విఫలమయ్యాయా? పవన్ కళ్యాణ్ ఆవిదంగా మాట్లాడటం తప్పా? రాష్ట్రంలో కాపులు జనసేనకు దూరం కాబోతున్నారా?అని ప్రశ్నించుకుని నిజాయితీగా సమాధానాలు చెప్పుకోవలసి ఉంటుంది.
ఎంతో మేధోమధనం తర్వాత టిడిపి, జనసేనలు ఓ ప్రణాళిక ప్రకారమే ఈ జెండా సభని నిర్వహించాయి. వాటికి ఇది మొదటి సభే తప్ప చివరిది కాదు. మొదటి సభలోనే ఆశయాలు, సిద్దాంతాలు వల్లెవేస్తే సభ చాలా చప్పగా సాగిందని రాజకీయ విశ్లేషకులే చెపుతారు.
ఈ సభ ముఖ్యోద్దేశం టిడిపి, జనసేనల బంధం చాలా బలంగా ఉందని తెలియజేయడం మాత్రమే. అదే విషయం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా తెలియజేశారు. అందుకే వైసీపి నేతలు కడుపు మంటతో రగిలిపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. జెండా సభతో ఊహించిన్నట్లే వైసీపిలో అభద్రతాభావం మరింత పెరిగిందని వారి మాటలతోనే అర్దమవుతుంది.
అపార రాజకీయ అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఆవేశంతో మాట్లాడితే ప్రజలు హర్షించరు. కనుకనే ఆయన చెప్పదలచుకున్న విషయాలను తనదైన శైలిలో చెప్పారు. టిడిపి, జనసేనలు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే ఏమి చేస్తాయో ఇప్పటికే చాలాసార్లు చెప్పాయి. కనుక మొదటి జెండా సభలో చెప్పన్నంత మాత్రన్న ఈ సభ ఆగమ్యగోచరంగా సాగిన్నట్లు భావించడం సరికాదు.
యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు సైన్యాధ్యక్షుడికి తన బలాబలాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలాగే తనతో కలిసి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడేది ఎవరో, శల్యసారధ్యం చేసేది ఎవరో కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడే యుద్ధంలో గెలవగలరు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు.
అయితే ఆయనలో ఇంకా కొంత రాజకీయ అమాయకత్వం, నిజాయితీ కారణంగా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేశారని అనుకోవచ్చు. ఆయన బయటకు చెప్పిన మాటలతో చాలా మంది నొచ్చుకొంటున్నప్పటికీ అదే వాస్తవమని అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నడిపించడం కోసమే సినిమాలు చేస్తున్న సంగతి ఎవరికీ తెలియని విషయమా?
పవన్ కళ్యాణ్ కావాలనుకుంటే మళ్ళీ ఒంటరిగా జనసేనను బరిలో దించి టికెట్లు అమ్ముకోలేరా?అలా చేస్తే లాభపడేది ఎవరు? నష్టపోయేది ఎవరు?అని ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ ఎంత వాస్తవిక ధోరణితో ముందుకు సాగుతున్నారో అర్దం చేసుకోవచ్చు.
ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య ఇద్దరూ కాపు పెద్దలే. కానీ వారు మొదటి నుంచి పవన్ కళ్యాణ్కి శల్యసారధ్యమే చేస్తున్నారు తప్ప ఈ యుద్ధంలో ఆయనను గెలిపించాలని ప్రయత్నించడం లేదు. వారి లేఖలతో జనసేనకు చేస్తున్న నష్టమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
కనుక పవన్ కళ్యాణ్ సరైన దిశలోనే బలంగా అడుగులు వేస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. జెండా సభ విజయవంతం అయ్యిందని వైసీపి నేతలు ఏడుపులతోనే ‘ఎండార్స్’ చేస్తున్నప్పుడు మళ్ళీ కోడిగుడ్డుకి ఈకలు వెతకడం దేనికి?





