ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ అధినేత జగన్ ను ఎన్ని సార్లు స్మరించారో అన్ని సార్లు తమ ప్రత్యర్థి అయిన చంద్రబాబు పేరును కూడా అన్ని సార్లు జపించారు వైసీపీ నాయకులు. ఒకరకంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కవనే చెప్పొచ్చు.
ఈ రాష్ట్రంలో అధికార పార్టీ చేతకాని తనాన్ని, వారి నిర్లక్ష్యానికి బాధ్యత చంద్రబాబే అంటూ స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మొదలుకుని ఆయన సహచర గణం వరకు బాబు పేరుని జపిస్తూ ఉంటారు. బాబు పేరు తలుచుకుని తలుచుకుని చివరికి జగన్ కుటుంబ సభ్యులు కూడా జగన్ కు వ్యతిరేకంగా బాబు బాటలో పయనించే స్థితికి పరిస్థితిని తెచ్చారు జగన్. దీనికి బెస్ట్ ఉదాహరణ ఆయన సోదరి మణులు వైస్ షర్మిల, సునీత.
ఏపీకి ఒకటి కాదు మూడు రాజధానులు అవసరం అంటూ మొదలుపెట్టిన వైసీపీ జగన్ నాటకం మూడు అడుగులు కూడా ముందుకు వెయ్యలేకపోయింది. అయితే దీనికి కారణం చంద్రబాబే అంటూ తమ చేతకాని తనాన్ని బాబు పై నెట్టి చేతులు దులుపుకోవాలని చూసారు. ఆ ఆతరువాత రాజధాని అమరావతిలో అభివృద్ధి కోసం తీసుకున్న రైతుల భూములను పేదలకు పంచుతాం అంటూ మొండిగా వాదించిన వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది.
ప్రభుత్వాన్ని నమ్మి అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను మీ సొంతానికి పంచుకుంటే ఎలా అంటూ రైతులు నిలదీయడంతో కోర్ట్ రైతుల వాదనకు మద్దతిచ్చి జగన్ కు ఒక మొట్టికాయ వేసింది. అయితే పేదలకు భూములివ్వకుండా అడ్డుపడుతున్నది బాబు అంటూ మరోసారి బాబు ను అడ్డుపెట్టారు జగన్. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెట్టి తెలుగు భాషను చంపడానికి ప్రయత్నించిన వైసీపీకి మాతృ భాషా ప్రేమికులు అడ్డుతగిలారు. అయితే దానికి బాబే కారణం అంటూ ఆవుపాఠం మొదలుపెట్టారు.
రాష్ట్రానికి తెస్తానన్న ప్రత్యేక హోదా రాలేదే అంటే బాబే అడ్డుకున్నాడు, పోలవరం పూర్తి కాలేదు అంటే బాబే ఆనకట్టగా నిలుస్తున్నారు అంటూ రాష్ట్రంలో వైసీపీ కి ఎక్కడ ఎదురు గాలి వీచినా దానికి బాబు బాబు అంటూ చంద్రబాబు జపం చేస్తున్నారు వైసీపీ నేతలు. చివరికి రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సందర్భాలలో కూడా ఈసీ ఇచ్చిన ఆదేశాలకు బాబే కారణంటూ పెన్షన్ల రాజకీయం మొదలుపెట్టి కొన్ని ప్రాణాలను బలికొన్నారు.
తమ సొంత బాబాయ్ వివేకా హత్యకు బాబే కారణం, వారి కుమార్తె జగన్ మీద చేస్తున్న ఆరోపణలకు బాబే కారణం, జగన్ సొంత చెల్లి వైస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బాబే, షర్మిల వైసీపీ కి వ్యతిరేకంగా గళం వినిపించడానికి బాబే, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వాన్ని బాబు ఆదేశాల మీదే రేవంత్ నడిపిస్తున్నారు అంటూ మళ్ళీ బాబు ప్రస్తావనే. ఇక పవన్ విషయం చెప్పనక్కరలేదు. ఏకంగా పవన్ ను బాబుకి దత్తపుత్రుడుని చేసేసారు జగన్ అండ్ కో.
ఇక కేంద్రంలో మోడీని, షాను మభ్య పెట్టి పొత్తు పెట్టుకుని పరిస్థితులను టీడీపీ పార్టీకి అనుకూలంగా మార్చికున్నారు బాబు అంటూ మొదలుపెట్టిన వైసీపీ ఇక పోలింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అల్లర్లకు బాబే కారణమంటూ మీడియా ముందుకు వచ్చారు జోగి రమేష్. టీడీపీ ఓటమి భయంతోనే వైసీపీ నేతలు, కార్యకర్తల మీద దాడులకు పాల్పడుతుందని, చంద్రాబు తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని రావణ కాష్ఠంగా మారుస్తున్నారని, అమాయక ప్రజలను బలి చేస్తూ రాక్షస క్రీడ ఆడుతున్నాడంటూ జోగి మరోసారి తన నోటికి పని చెప్పారు.
ఒక ప్రణాళిక ప్రకారమే తమ పై దాడులు చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న ఈ అల్లర్లకు పూర్తి బాధ్యత బాబుదే అంటూ మళ్ళీ అదే బాబు పాఠం చదువుతున్నారు జోగి. జూన్ 4 తరువాత తిరిగి అధికారంలోకి వచ్చేది వైసీపీ నే. అప్పుడు బాబు ఏపీ వదిలి పారిపోవడం ఖాయం అంటూ జోస్యాలు చెప్పుకుంటూ పార్టీ క్యాడర్ ను నిలబెట్టుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు జోగి. జగన్ కు బాబు పిచ్చి పట్టింది అంటూ షర్మిల వైసీపీ బాబు పాఠానికి కౌంటర్ వేసిన ఈ వైసీపీ నేతలు మాత్రం అదే ధోరణిలో ముందుకెళ్తున్నారు.
గత ఐదేళ్లుగా చెప్పింది కాకుండా కొత్తగా..కొత్తగా.. ఏమైనా ఉంటే చెప్పండి సార్, మీకు తెలుగు భాషలో నచ్చిన పేరు ఇదొక్కటేనా..? అంటూ జోగి మీద, వైసీపీ మీద సెటైర్లు పేలుతున్నాయి. ‘చంద్రబాబు నాయుడు’…ఈ పేరు గుర్తు పెట్టుకోండి, జూన్ 4 తరువాత దీని సౌండ్ చాలా గట్టిగా వినిపిస్తుంది మీరు కూడా వింటారు అప్పుడు మాట్లాడుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్…అంటూ టీడీపీ తమ్ముళ్లు వైసీపీ కి కౌంటర్లు వేస్తున్నారు.




