బిఆర్ఎస్‌ తొందరపెడుతుంటే రేవంత్‌ ఊరుకొంటారా?

KCR-Revanth

రేవంత్‌ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయనేలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయనేలేదు. కానీ బిఆర్ఎస్, బీజేపీ నేతలు అప్పుడే రేవంత్‌ ప్రభుత్వం ఆరు నెలల్లో లేదా ఏడాదిలోగానే పడిపోతుందని అప్పుడు తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పుకొంటున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌కి కాస్త దుడుకుతనం ఎక్కువ కనుక ఈవిదంగా మాట్లాడారని సర్ధిచెప్పుకోవచ్చు. కానీ దాదాపు నాలుగు దశాబ్ధాలుగా రాజకీయ అనుభవం కలిగి, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి వంటి సీనియర్ నాయకుడుగా కూడా ఈవిదంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ADVERTISEMENT

జనగామ జిల్లాలో నిన్న బిఆర్ఎస్‌ శ్రేణులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చాయి. కనుక ఐదుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తే ప్రభుత్వం పడిపోతుంది. మంత్రి పదవులు ఆశించి భంగపడినవారు ఏదో రోజున బయటకు రావడం ఖాయమే. బిఆర్ఎస్‌ 39, మిత్రపక్షమైన మజ్లీస్‌ 7 సీట్లు కలిపితే మనకు 46 మంది ఉన్నారు. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్యేలను, వీలైతే బీజేపీని కూడా కలుపుకొంటే మళ్ళీ మనమే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతాము. ఇదంతా జరగడానికి ఓ ఏడాది పట్టవచ్చు. కనుక అంతవరకు బిఆర్ఎస్‌ కార్యకర్తలు అందరూ ఓపిక పట్టాలి,” అని కడియం శ్రీహరి అన్నారు.

బీజేపీ, బిఆర్ఎస్‌ పార్టీలు తమ ప్రభుత్వం పడిపోతుందని లేకుంటే పడగొట్టాలని కాచుకు కూర్చోన్నాయని, కనుక వాటి నుంచి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఏమి చేయాలో కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్‌ రెడ్డికి తెలియదనుకోలేము.

అయితే ప్రభుత్వం ఏర్పడగానే తొందరపడి బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో లాగేస్తే ప్రజలలో తమ పట్ల వ్యతిరేకత మొదలవుతుంది. కనుక ఈవిషయంలో తొందర పడకూడదని రేవంత్‌ రెడ్డి భావిస్తుండవచ్చు. కానీ బిఆర్ఎస్‌, బీజేపీ నేతలే ఆయనను తొందరపెడుతున్నారు కనుక కొన్ని నెలలు అగాల్సిన అవసరం లేదిప్పుడు.

గతంలో కాంగ్రెస్‌, టిడిపిలు తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తూ కేసీఆర్‌ ఆ రెండు బిఆర్ఎస్‌ ప్రయత్నిస్తున్నట్లు పార్టీల ఎమ్మెల్యేలను బిఆర్ఎస్‌లోకి ఫిరాయింపజేసుకొని నిర్వీర్యం చేశారు.

ఇప్పుడు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కడియం శ్రీహరి నోటే ఈ మాట వచ్చినందున, బిఆర్ఎస్‌ పార్టీ తన ప్రభుత్వాన్ని ఆస్తిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకి రేవంత్‌ రెడ్డి ముహూర్తం పెట్టేయవచ్చు. అప్పుడు ప్రజలు కూడా రేవంత్‌ రెడ్డినే సమర్ధిస్తారు తప్ప తప్పు పట్టరు.

బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలలో సుమారు 15 మంది ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలతో ‘టచ్’లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్‌ రెడ్డిని గద్దె ఎక్కకముందే దించేసేందుకు ఆరాటపడుతున్న కడియం శ్రీహరి వంటి నేతలే తమ పార్టీని దెబ్బ తీసేందుకు రేవంత్‌ రెడ్డిని తొందరపెడుతున్నారు కనుక అతి త్వరలోనే ఆయన ఆ పని మొదలుపెట్టడం ఖాయం. అప్పుడు ఏడ్చి ప్రయోజనం ఉండదు.

ADVERTISEMENT
Latest Stories