జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తెలంగాణా సీఎం కేసీఆర్ ను కలిసి ఆయనను పొగడ్తలల్తో ముంచెత్తినా ఆయనను నెత్తికి ఎక్కించుకునే ఉద్దేశం లేదట తెలంగాణా రాష్ట్ర సమితికి. చంద్రబాబు ఆంధ్రలో ఇచ్చినట్టుగా ఆయనను అనవసరమైన ప్రాముఖ్యత ఇవ్వకూడదని ఆ పార్టీ వ్యూహమట.
దీంట్లో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మధ్య రహస్య ఒప్పందం ఉందన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ తన సినిమా (అజ్ఞాతవాసి) కు ఐదు షోల అనుమతి కోసం సీఎం కేసీఆర్ను కలిశారని కర్నె అన్నారు.
ఆయనతో రహస్య ఒప్పందం పెట్టుకునేంత బలహీనంగా టీఆర్ఎస్ లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ రెండు రాష్ట్రాల రాజకీయాల్లోకి అప్పుడప్పుడు వచ్చి వెళ్లే నేతని, ఆయన వల్ల లాభం లేదు, నష్టం లేదని కర్నె ప్రభాకర్ అన్నారు. మరోవైపు తెలంగాణా రావడంలో ముఖ్యపాత్ర పోషించిన మీరా కుమార్ కు, పోరాటంలో కాడే మోసిన కోదండరామ్ యాత్రకు అనుమతి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ యాత్రకు ఎలా ఇస్తారని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది.



