బాబు కోసం బాలయ్య సినిమా ఎందుకు ఆపలేదు? మంత్రిగారి ధర్మసందేహం

Minister Karumuri Nageswara Rao

వైసీపి మంత్రులు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎప్పుడైనా తమ శాఖలకు సంబందించిన అంశాల గురించి ఏవైనా మాట్లాడుతారేమోనని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తుంటారు. కానీ అది తప్ప మిగిలినవన్నిటి గురించి మాట్లాడుతుంటారు.

ఇవాళ్ళ బాలయ్య సినిమా భగవంత్ కేసరి విడుదలవడంతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నోటికి పని చెప్పారు. “చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే బాలయ్యకు బాధగా లేదా? ఉంటే మరి సినిమా ఎందుకు విడుదల చేశారు? హెరిటేజ్ సంస్థలని ఎందుకు మూసేయలేదు? హెరిటేజ్‌కు లాభాలు వచ్చాయని ఆ సంస్థ ప్రకటించుకొంది.

ADVERTISEMENT

బాబు కోసం ఆయన కుటుంబ సభ్యులు వ్యాపారాలు మూసుకోరు. బాలయ్య సినిమాలు ఆపుకోడు కానీ ప్రజలు పనులు మానుకొని రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలియజేయాలా? ఎందుకు? చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే హైదరాబాద్‌లో ధర్నాలు చేయడం దేనికి? ఏం ఆయనేమైనా దేవుడా?ఆయన అవినీతికి పాల్పడినప్పటికీ మా ప్రభుత్వం జైలులో ఆయనకు సకల సౌకర్యాలు కల్పిస్తోంది. అయినా టిడిపి నేతలు మాపై ఏదో వంకతో బురద జల్లాలనే ప్రయత్నిస్తున్నారు,” అని అన్నారు.

మంత్రిగా వ్యవహరిస్తున్న కారుమూరి ఈవిదంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బాలయ్య ఆ సినిమాను నిర్మించలేదు. నటించారు. కనుక నిర్మాతలు ఆ సినిమాని తాము ముందుగా నిర్ణయించుకొన్న తేదీన విడుదల చేసుకొన్నారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఓ సినిమా నిలిచిపోతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ నష్టపోతారనే విషయం మంత్రిగారికి తెలియదా?వైసీపి ప్రభుత్వ ఈ ధోరణి కారణంగానే సినీ పరిశ్రమ ఏపీకి తరలిరావడానికి భయపడుతోంది.

హెరిటేజ్ ఓ అతిభారీ పరిశ్రమ, ఓ వ్యాపార సంస్థ. దానిలో వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. నిత్యం లక్షల లీటర్ల పాలు సేకరించి ప్రాసెసింగ్ చేసి సరఫరా చేస్తుంటుంది. రేయింబవళ్ళు నిరంతరంగా పనిచేసే అటువంటి పరిశ్రమని ఎందుకు మూయలేదని, ఎందుకు లాభాలు వస్తున్నాయని మంత్రిగారే ప్రశ్నిస్తుండటం చూస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు ఎందుకు రావడం లేదో అర్దం చేసుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories