‘జనసేన’ అధినేత పవన్ వహిస్తున్న మౌనం పట్ల కత్తి మహేష్ మరోసారి మీడియా డిబేట్ లో అసహనం వ్యక్తం చేసారు. ఈ నెల 15వ తేదీ వరకు వేచిచూస్తానని చెప్పిన కత్తి, 16వ తేదీ నాడు ప్రముఖ మీడియా ఛానల్ లో పాల్గొని మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న చేష్టలను ఏకరువు పెట్టారు. తనకు పండగ శోభ కూడా లేకుండా తన ఊరు వరకు వెంబడించిన పవన్ కళ్యాణ్ అభిమానుల తీరును కత్తి మహేష్ ఎండకట్టగా, పవన్ కళ్యాణ్ స్పందించని పక్షంలో ఆయనపై ఎదురుదాడి చేయడమే తనకు మిగిలి ఉన్న ఏకైక ఆప్షన్ గా ప్రకటించారు.
పవన్ ఫ్యాన్స్ ఎంతగా నన్ను రెచ్చగొడితే, అంతగా తాను పవన్ పై ఎదురుదాడి చేస్తానని, ఇంత జరుగుతున్నా తన అభిమానులను నియత్రించుకోలేనివాడు ప్రజాస్వామ్యానికి ఎట్టి పరిస్థితులలోనూ పనికిరాడని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పై ఖచ్చితంగా స్వతంత్ర్య అభ్యర్ధిగా తాను పోటీ చేసి తీరుతానని, దానిని ఎవరూ అడ్డుకోలేరని, పోటీ చేసే హక్కు నాకుందని పేర్కొన్న కత్తి, ఆయన అభిమానులు బానిస మనస్తత్వతంతో బ్రతికేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు.
పండగ సమయంలో ఊళ్లకు వెళ్ళే సామాన్యులకు తన వలన ఇబ్బంది కలిగినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి ఓ సామాన్యుడికి క్షమాపణలు చెప్పగా, పవన్ కళ్యాణ్ ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు కంటే పవన్ గొప్పవాడిగా ఫీల్ అవుతున్నారా? దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్… ఇలా ఎవరి గురించైనా మాట్లాడొచ్చు గానీ పవన్ గురించి మాట్లాడితే మాత్రం దాడి చేస్తారా? అంటూ లాజిక్ లతో కూడిన ప్రశ్నలు వేసి పవన్ ఫ్యాన్స్ ను డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేసారు.
కత్తి చేస్తున్న వాదనలలో అర్ధముంది. అందులో లాజిక్ కూడా ఉంది. ఇది ఎవరికైనా అర్ధమయ్యే విషయమే. వీటన్నింటికి తోడు స్వయంగా చంద్రబాబు ఓ సామాన్యుడికి సారీ చెప్పడం మీడియా వర్గాలలో హైలైట్ అయ్యింది. మరి చంద్రబాబు అంతటి వ్యక్తి తన వలన జరిగిన దానికి చింతించి సారీ చెప్పడంతో, ఈ అంశం కత్తి మహేష్ కు ఒక ఆయుధంగా దొరికినట్లయ్యింది. దీంతో చంద్రబాబును అడ్డు పెట్టుకుని, అంతకంటే గొప్పవాడిగా పవన్ ఫీల్ అవుతున్నారా? అన్న ప్రశ్నలకు పవన్ ఫ్యాన్స్ కూడా బదులు చెప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే నిలకడలేని మనస్తత్వంగా పవన్ ను పేర్కొంటున్న వైనం భవిష్యత్తు పొలిటికల్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనపడుతోంది.



