ఇప్పటివరకు సినిమా నటుడిగా, రాజకీయ నాయకుడిగా ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కానీ ఇక నుండి పవన్ వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్స్ చేస్తాను, ఆ సౌలభ్యాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులే నాకు కల్పించారు అంటూ తాజాగా మహేష్ కత్తి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అవును… గత కొన్నాళ్ళుగా సాగుతున్న ‘పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ మహేష్ కత్తి’ల యుద్ధం పతాక స్థాయికి చేరుకున్నట్లుగా కనపడుతోంది.
“తాను ఓ రెస్టారెంట్ లో బీరు తాగుతున్న ఓ ఫోటోగ్రాఫ్ ను పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. నాకు తెలియకుండా నేనెప్పుడూ బీర్ తాగి ఈ దేశానికి క్రిమినల్ గా ఎలా మారానో నాకు తెలియడం లేదు. ఏది ఏమైనా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్ చేయడానికి ఆయన అభిమానులు నాకు లైసెన్స్ ఇచ్చారు… జాగ్రత్త…! అంటూ పవన్ ఫ్యాన్స్ కు ఒక విధమైన వార్నింగ్ ఇచ్చారు మహేష్ కత్తి. చూడబోతుంటే… ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనపడడం లేదు.
ముఖ్యంగా ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా మహేష్ కత్తి ఏకరువు పెడుతుండడంతో ఫ్యాన్స్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఫాతిమా కాలేజీ విషయంలో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన తర్వాత చంద్రబాబు స్పందించడాన్ని విమర్శిస్తూ… బాబును – పవన్ ను ‘తోడుదొంగలు’గా అభివర్ణిస్తూ మునుపటి రోజు ఓ ట్వీట్ చేసారు కత్తి. ఇలా రోజు మొత్తమ్మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఏదొక ట్వీట్ చేస్తుండడం అసలు వివాదానికి కేంద్రంగా మారుతోంది.



