కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు ‘టిఆర్ఎస్ బ్రాండ్ ఇమేజ్’ వదులుకుని బిఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు. అయితే శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమికి అదీ ఓ కారణమైంది. ఈ ఓటమి ఆయన జాతీయ రాజకీయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అంటే ఆయన దేని కోసం పార్టీ పేరుని మార్చుకున్నారో ఆ ప్రయోజనం నెరవేరకపోగా తెలంగాణలో కూడా నష్టపోయారని అర్దమవుతోంది.
కేసీఆర్తో సహా ఆ పార్టీ నేతలందరూ కూడా ఇంతకాలం ‘తెలంగాణ సెంటిమెంట్’ ని ఓ బలమైన ఆయుధంగా వాడుకుంటూ ప్రత్యర్ధులపై పైచేయి సాధిస్తుండేవారు. శాసనసభ ఎన్నికలలో కూడా దానిని బాగానే వాడుకున్నారు. కానీ అవసరమైనప్పుడు జాతీయవాద, ప్రాంతీయవాద పార్టీలాగ మాట్లాడుతుండటం వలన విశ్వసనీయత కోల్పోతామని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు తెలియదనుకోలేము. కానీ శాసనసభలో తెలంగాణ సెంటిమెంట్ వదులుకొని నష్టపోలేరు కనుక పక్కా ప్రాంతీయ పార్టీ నేతల్లాగా మారిపోయారు.
ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. అంటే మళ్ళీ జాతీయపార్టీగా మారి జాతీయ స్పూర్తి, గుణాత్మక మార్పు అంటూ మాట్లాడాల్సి ఉంటుంది. అయితే మోడీని గద్దె దించడం సంగతి అటుంచితే, ముందు తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో కనీసం 10-12 గెలుచుకోవడం చాలా అవసరం లేకుంటే పార్టీ చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక శాసనసభ, లోక్సభ ఎన్నికలలో మహారాష్ట్రపైకి గులాబీ సేనలు దండయాత్రకు పంపుతారో లేదో?




