హైదరాబాద్లో నిన్న చేనేత దినోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్ తన ప్రసంగం చివరిలో జాతీయ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది. దానిలో బిఆర్ఎస్ కూడా ఉంటుంది. అప్పుడు రాష్ట్రానికి రావలసిన నిధులు, ఉన్నత విద్యాసంస్థలు, ప్రాజెక్టులు అన్నీ సాధించుకొని తెచ్చుకొందాము,” అని అన్నారు.
ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారని చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని కేటీఆర్ చెపుతున్నారు. అంటే కేసీఆర్ అప్పుడే అస్త్ర సన్యాసం చేసేశారా లేక వాస్తవ పరిస్థితులను గమనించి తన ఆలోచనలను, వైఖరిని, వ్యూహాలను మార్చికొన్నారా? అనే సందేహం కలుగుతోంది.
కేసీఆర్ బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ కేసీఆర్ జాతీయ రాజకీయాలు చక్రం తిప్పాలనుకొంటున్నారు కనుక ఒకవేళ లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బయటి పార్టీల మద్దతు అవసరం పడితే, అప్పుడు కేసీఆర్ దానిలో చేరి తెలంగాణకు కావలసినవి సాధించుకోవాలనుకొంటున్నారేమో?
లేదా ఒకవేళ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ మిత్రపక్ష ‘ఇండియా’ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే దానికి బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి సంకీర్ణ ప్రభుత్వంలో భాగాస్వామి కావాలనుకొంటున్నారేమో?
బహుశః అందుకే కేసీఆర్ ఇదివరకులా జాతీయ రాజకీయాలంటూ విమానం వేసుకొని దేశమంతా తిరగకుండా కేవలం మహారాష్ట్రకే పరిమితం అవుతున్నట్లున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా బిఆర్ఎస్ పార్టీ కొన్ని లోక్సభ సీట్లు గెలుచుకోగలిగితే అప్పుడు బిఆర్ఎస్ ఎంపీల సంఖ్య పెరుగుతుంది. దాంతో జాతీయ రాజకీయాలలో కేసీఆర్ ప్రాధాన్యత కూడా పెరుగుతుంది.
అప్పుడు కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వస్తే దానిలో చేరి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ చక్రం తిప్పాలని కేసీఆర్ నిర్ణయిచ్చుకొని ఉండవచ్చు. అయితే దేశ్ కీ నేత, కాబోయే ప్రధానమంత్రి అంటూ ఇతర రాష్ట్రాలలో ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టించుకొని, తన పార్టీ నేతలు, మంత్రుల చేత చెప్పించుకొన్న కేసీఆర్, ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే చాలనుకోవడం నిజమైతే, ప్రధానమంత్రి అవడం అంత ఈజీ కాదని కేసీఆర్ గ్రహించిన్నట్లే ఉన్నారు.



