సంక్రాంతి పండుగకి బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, కోలీవుడ్ హీరోలు విజయ్, అజిత్ నటించిన వారసుడు, తెగింపు సినిమాలు వస్తున్నాయి. కనుక ఈసారి సినీ అభిమానులకి సంక్రాంతి పండుగ మరింత ఉత్సాహంగా జరుపుకోవచ్చు. పండగ తర్వాత రాష్ట్రంలో మరో రాజకీయ పండగ జరుగబోతోంది. అదే… తెలంగాణ సిఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్గా మారిన టిఆర్ఎస్ పార్టీ ఏపీలో ప్రవేశించబోతోంది. కేసీఆర్ స్వయంగా ఏపీలో ఓ భారీ బహిరంగసభ నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు.
ఇందుకోసం ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తోట చంద్రశేఖర్, ఆ పార్టీ నేత చింతల పార్ధసారధి బుదవారం సాయంత్రం హైదరాబాద్లో కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో సమావేశమయ్యి చర్చించారు. సంక్రాంతి తర్వాత ఏపీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి, రాష్ట్రంలో బిఆర్ఎస్తో కలిసివచ్చేవారిని గుర్తించి జిల్లా, మండల స్థాయిలో కమిటీలను నిర్మించుకోవాలని కేసీఆర్ సూచించారు. అది పూర్తికాగానే పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియని ప్రారంభించాలని సూచించారు. త్వరలోనే బహిరంగసభ వేదిక, తేదీలను ప్రకటించగానే దానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ తోట చంద్రశేఖర్ని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన కేసీఆర్, ఆంద్రా ప్రజలని రాక్షస సంతతి అని, వారిని తెలంగాణ నుంచి తరిమికొట్టాలంటూ చాలా దారుణంగా అవమానించారు. అలాగే రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి ఏపీతో పేచీలు పెట్టుకొంటూనే ఉన్నారు. నీళ్ళు, ఆస్తులు, బకాయిల గురించి రకరకాలుగా వాదనలు చేస్తూ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏపీకి చెందిన నేతలెవరూ రాజకీయాలు చేయడానికి వీల్లేదని చెపుతూ ఆయన మాత్రం ఏపీలో పార్టీని విస్తరించి పోటీ చేయడానికి హక్కు కలిగిఉందని, తనకు ఏపీ ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నారు. గత ఎన్నికలలో తెర వెనుక పావులు కదిపి టిడిపి ఓడిపోయేలా చేసి అమరావతి నిర్మాణం జరగకుండా నిలిపివేయించడంతో ఏపీకి, అమరావతికి రావలసిన పరిశ్రమలు, ఐటి కంపెనీలు హైదరాబాద్కి తరలిపోయాయి.
ఏపీలో ఇంత రాజకీయ అనిశ్చిత పరిస్థితులను సృష్టించిన కేసీఆరే, ఇప్పుడు ఏపీలో రాజకీయ శూన్యత, నాయకత్వలోపం కారణంగానే ఏపీ అభివృద్ధి చెందడం లేదని, బిఆర్ఎస్ని ప్రజలు ఆదరిస్తే అభివృద్ధి రుచి చూపిస్తానని చెపుతున్నారు. ఏపీని ఇంత ఘోరంగా దెబ్బతీసి, ఇంకా తీస్తూనే ఉన్న కేసీఆర్, ఏపీని ఉద్దరిస్తానని మాయమాటలు చెపుతుంటే ఏపీలో కొందరు రాజకీయ నిరుద్యోగులు ఆయనకి తానతందాన పాడుతున్నారు.
అయితే కేసీఆర్ లక్ష్యం బిఆర్ఎస్కి జాతీయ పార్టీగా గుర్తింపు సంపాదించుకోవడానికి అవసరమైన ఓట్లు, సీట్లు సంపాదించుకోవడమే తప్ప ఏపీని ఉద్దరించడం కాదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఏపీలో టిడిపిని అడ్డుకోవడం, వైసీపీని గద్దె దింపడం రెండూ కేసీఆర్ వల్ల కావని అందరికీ తెలుసు.



