నేడు కర్ణాటక శాసనసభ ఎన్నికలకు పోలింగ్ జరుగబోతోంది. మొత్తం 224 స్థానాలకు 2,615 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 13న ఫలితాలు వెలువడతాయి. ఎన్నికలలో పోటీ ప్రధానంగా అధికార బిజెపి, కాంగ్రెస్ పార్టీల మద్యనే సాగింది. సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిలలో ఏదో ఒకటి గెలుస్తుంది. అది వేరే విషయం. కానీ ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ కూడా పోటీ చేస్తుందని, కుమారస్వామిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతానని ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పిన తెలంగాణ సిఎం కేసీఆర్, అటువైపు తొంగిచూడలేదు! కాంగ్రెస్, బిజెపిల మద్య నలిగిపోతున్న జెడిఎస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు! తమ పార్టీకి మద్దతుగా ప్రచారానికి కేసీఆర్ వస్తారని దేవగౌడ స్వయంగా చెప్పుకొన్నా కేసీఆర్ కనీసం బిఆర్ఎస్ నేతలను కూడా పంపలేదు!
నిజానికి దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క కర్ణాటకలో మాత్రమే బిజెపి అధికారంలోకి రాగలుగుతోంది. ఎంత ప్రయత్నించినా మిగిలిన మూడు రాష్ట్రాలలో రాలేకపోతోంది. కనుక ఈ ఎన్నికలలో గెలిస్తే తర్వాత తెలంగాణపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. కనుక కర్ణాటకలో బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే, తెలంగాణలో బిజెపిని నిలువరించవచ్చని కేసీఆర్ భావించారు. రాజకీయంగా చూస్తే ఇది సరైన ఆలోచనే అని అర్దమవుతోంది. కానీ కేసీఆర్ హటాత్తుగా వెనక్కు తగ్గారు. దేవగౌడ, కుమారస్వామిలను ‘బకరాలు’ చేశారు. కేసీఆర్ అందించే ‘సహాయసహకారాల’పై ఎన్నో ఆశలు పెట్టుకొన్నవారు కాంగ్రెస్, బిజెపిలతో ఒంటరి పోరాటం చేయకతప్పలేదు. చేసినా ప్రయోజనం లేదని సర్వేలు చెపుతున్నాయి.
అయితే, ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు? కుమారస్వామికి కేసీఆర్ ఎందుకు హ్యాండ్ ఇచ్చారు?అంటే తగినంత సమయం లేకపోవడం వలన పోటీ చేయలేకపోయామని బిఆర్ఎస్ నేతలు చెప్పుకోగా, జెడిఎస్తో సీట్ల సర్దుబాటు కుదరక పోవడం వలన పోటీ చేయలేదని మొదట ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ రెంటికీ మించి మరొకటి కనిపిస్తోంది. అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్!
ఆ కేసులో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితని ఈడీ ఢిల్లీకి రప్పించి విచారణ జరపడం, నేడో రేపో ఆమెను అరెస్ట్ చేయడం ఖాయమని మీడియా లీకులు ఇవ్వడం, అప్పుడు ఢిల్లీ, హైదరాబాద్లో బిఆర్ఎస్ నేతలు చేసిన హడావుడి అందరూ చూశారు. కానీ ఆ తర్వాత హటాత్తుగా ఈడీ సైలెంట్ అయిపోయింది… బిఆర్ఎస్ కూడా సైలెంట్ అయిపోయింది!!!
కర్ణాటక ఎన్నికలలో బిజెపి గెలవడం చాలా అవసరం. కానీ కేసీఆర్ కర్ణాటకలో ప్రవేశిస్తే కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్-జేడీఎస్ పార్టీల మద్య ముక్కోణపు పోటీ జరిగి ఓట్లు చీలిపోతే బిజెపికి నష్టం జరుగుతుంది. కనుక కర్ణాటకవైపు కేసీఆర్ తొంగిచూడకుంటే లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత జోలికి ఈడీ రాదనే ఒప్పందం జరిగి ఉండవచ్చు. బహుశః అందుకే కేసీఆర్ తగ్గి ఉండవచ్చు.
ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పోటీ చేయకపోవడంపై మీడియాఅడిగిన ప్రశ్నకు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెపుతూ “కేసీఆర్కు ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలుసు…” అని అన్నారు. నిజమే కదా?



