తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్కి ‘అపర చాణక్యుడు’ టైటిల్ ఉంది. కనుక దేశ రాజకీయాల పట్ల క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉన్నప్పటికీ ప్రధానిగా దేశాన్ని ఏలాలనుకోవడం దురాశే అని చెప్పక తప్పదు.
దేశంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ లేదా బిజేపితో కలిసి సాగుతుంటాయి. లేదా వాటితో ఆ రెండు పార్టీలు కూటమిగా సాగుతుంటాయి. ఇదేమీ రహస్యం కాదు. కళ్ళకు కనబడుతూనే ఉంటుంది.
వైసీపీ, బీఆర్ఎస్, వంటి కొన్ని పార్టీలు గోడ మీద పిల్లుల్లా కూర్చునప్పటికీ తమ అవసరం, అవకాశం బట్టి ఆ రెండు పార్టీలతో రహస్యంగా చేతులు కలుపుతుంటాయి. ఇది కూడా రహస్యం కాదు.
కనుక ఇవన్నీ కేసీఆర్కి తెలియకనే విమానం వేసుకొని దేశమంతా తిరిగారని అనుకోలేము. కానీ తనను చూడగానే కాంగ్రెస్, బిజేపి మిత్రపక్షాలు తోకూపుకుంటూ తన వెంట వచ్చేస్తాయని అనుకోవడం, ప్రధాని పదవి కోసం వారి ఆశలు, కోర్కెలు పక్కన పెట్టి తన నాయకత్వాన్ని, ప్రధాని అభ్యర్ధిగా అంగీకరిస్తారని కేసీఆర్ అనుకోవడం అత్యాశ కాదు… దురాశే కదా?
కానీ ‘అపర చాణక్యుడు’ ఇలా పగటికల కనడానికి కారణం తెలంగాణలో కాంగ్రెస్, బిజేపిలతో శత్రుత్వమే. మొదట బిజేపి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండూ కేసీఆర్కి కొరకరాని కొయ్యలుగా మారాయి. పైగా తన అధికారాన్ని సవాళ్లు చేస్తున్నాయి. కనుక కేసీఆర్కి వాటితో చేతులు కలపలేని నిసహాయత ఏర్పడింది.
అదే… ఆయన కాంగ్రెస్ లేదా బిజేపితో స్నేహానికి సిద్దపడి ఉంటే నేడు అయన పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, తెలంగాణలో రాజకీయ పరిస్థితి వేరేగా ఉండేది. అప్పుడు ఆయన జాతీయ స్థాయిలో హడావుడి చేయాలనే ఆలోచన చేయాల్సిన అవసరమే కలిగేది కాదు.
ఒకవేళ చేసినా కాంగ్రెస్ లేదా బిజేపి మిత్ర పక్షాల మద్దతు తప్పక లభించేది. సిఎం చంద్రబాబు నాయుడు, సిఎం రేవంత్ రెడ్డిలా జాతీయస్థాయి నాయకులుగా గుర్తింపు, గౌరవం లభించేది.
కానీ జాతీయ మైకంలో ఉన్న కేసీఆర్కి తెలంగాణలో తన పునాదులు కదిలిపోతున్నాయనే విషయం కూడా గ్రహించలేకపోయారు. గ్రహించేసరికి ఫామ్హౌసులో ఉన్నారు.




