తమిళనాడులో డీఎంకే,అన్నాడీఎంకేలు దశాబ్దాలుగా బద్ద శత్రువులు. కానీ ఆ రెండు పార్టీల మద్యనే అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది. తొలిసారిగా టీవీకే పార్టీతో విజయ్ మూడో రాజకీయశక్తిగా అవతరించారు. కానీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతున్నారు. లేదా ఆ కారణంగా ఆయనకు గవర్నర్ అవకాశం ఇవ్వడం లేదు.
ఈ నేపధ్యంలో బద్ధ శత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకేలు చేతులు కలుపబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని ఆ రెండు పార్టీలు ఖండించకపోవడంతో అటువంటి అవకాశం ఉందనిపిస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ తాజా విమర్శలో డీఎంకే,అన్నాడీఎంకేలు చేతులు కలపబోతున్నాయని స్పష్టం చేశారు.
“అన్నాడీఎంకేతో బిజేపి కూడా ఉంది. అటువంటి మతతత్వ పార్టీతో చేతులు కలిపేందుకు డీఎంకే సిద్ధమవుతున్నప్పుడు, లౌకికవాదానికి కట్టుబడిన మా కాంగ్రెస్ పార్టీ దాంతో ఎలా కలిసి ఉండగలదు? ఈ విషయం మేము ముందే పసిగట్టినందున డీఎంకేకి గుడ్ బై చెప్పేసి లౌకికవాదానికి కట్టుబడిన టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాము.
ఆ రెండు పార్టీల ఏకైక లక్ష్యం ఎట్టి పరిస్థితులలో విజయ్ సిఎం కాకుండా అడ్డుకోవడమే. అందుకోసం అవి తమ శత్రుత్వాన్ని కూడా పక్కనపెట్టి చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి,” అని మాణికం ఠాగూర్ అన్నారు.
మాణికం ఠాగూర్ చెప్పినట్లు ఆ రెండు బలమైన ద్రవిడ పార్టీలు తమ శత్రుత్వం, భేషజాలు పక్కన పెట్టి చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, ఇక తమిళనాడులో కాంగ్రెస్, బిజేపిలకు తలుపులు మూసుకుపోవడం ఖాయం. కానీ పదవి, అధికారం దాహంతో ఉన్న ఆ పార్టీల నేతలు ఒకరికోసం మరొకరు త్యాగాలు చేయగలరా? చేసినా ఎంత కాలం కలిసుండగలవు?




