తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని ఎవరూ వేలెత్తిచూపలేరు. తెలంగాణ సాధించుకొని తన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తూ, ‘తెలంగాణ మోడల్’ అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ పార్టీని గెలిపించమని కేసీఆర్ మహారాష్ట్ర ప్రజలను కోరుతున్నారు. అది సహజం కూడా.
కానీ ఏపీతో కలిసి ఉండలేమని చెప్పి కోట్లాడి రాష్ట్ర విభజన చేసుకొన్న తర్వాత మళ్ళీ ఏపీలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించి, ఇక్కడి ప్రజల ఓట్లు ఆశిస్తుండటమే విడ్డూరం. ఏపీని వద్దనుకొన్న కేసీఆర్ ఒకవేళ ఇక్కడ కూడా పెత్తనం చేయాలనుకొంటే తెలంగాణను మళ్ళీ ఏపీలో విలీనం చేసుకొని ఏలుకోవచ్చుగా?ఎవరు వద్దన్నారు?
ఏపీలో బిఆర్ఎస్ అడుగుపెట్టడాన్ని కేసీఆర్ తన మాటకారితనంతో ఎంత చక్కగా సమర్ధించుకొన్నప్పటికీ, ఆయన వలన ఏపీకి జరుగుతున్న నష్టం సంగతి ఏమిటి?అని ఆలోచిస్తే జవాబు దొరకదు.
ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, గత ఎన్నికలలో ఆయన చేసిన తెరచాటు రాజకీయాలు చేసి ప్రభుత్వం మారేలా చేయడం వలననే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం నిలిచిపోయింది. ఏపీలో అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులు తెలంగాణకు తరలిపోతున్నాయి. ఈ కారణంగా ఏపీలో దాదాపు ప్రతీ కుటుంబంలోని యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్కే వలసలు పోవలసివస్తోందనేది ఏపీలో అందరికీ తెలుసు.
ఇదొక్కటే కాదు… జాతీయ స్పూర్తి, సమగ్రత, దేశాభివృద్ధి గురించి కేసీఆర్ చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి కేసీఆర్లో ‘అచ్చమైన తెలంగాణవాది’ బయటకు వస్తుంటాడు. విభజన చట్ట ప్రకారం ఆస్తుల పంపకాలు, ఏపీకి చెల్లించాల్సిన రూ.6,000 కోట్ల బకాయిలు, నదీ జలాలలో వాటాలు ఇంకా చాలా సమస్యలు అందుకే అపరిష్కృతంగా ఉండిపోయాయి.
తెలంగాణలో కేసీఆర్ శరవేగంగా అతిభారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తూ కృష్ణా, గోదావరి నదీజలాలను రాష్ట్రంలో అన్ని జిల్లాలకు పారించుకొంటున్నారు. అందుకు ఆయనను తప్పక అభినందించాల్సిందే. కానీ దిగువనున్న ఆంద్రా పరిస్థితి ఏమిటి?ముఖ్యంగా రాయలసీమ జిల్లాల పరిస్థితి ఏమిటి?కేసీఆర్ యదేచ్చగా కృష్ణా జలాలను తరలించుకుపోతున్నా జగన్ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరాలు చెప్పడం లేదు?అనే సందేహం కలుగుతుంది.
దానికి సమాధానం కళ్లెదుటే ఉంది. ఏపీలో వైసీపి అధికారంలోకి రావడానికి ఆయన తెర వెనక నుంచి అవసరమైన సహాయసహకారాలు అందిస్తుండటమే అని వేరే చెప్పక్కరలేదు. కేసీఆర్ తన రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారు కనుక ఆయన ‘తెలంగాణ భక్తి’ని, తన రాష్ట్రం పట్ల నిబద్దతను మెచ్చుకోవలసిందే.
కానీ ఆయన ఏపీని అనేక విధాలుగా దెబ్బతీస్తున్నారని తెలిసి ఉన్నా మౌనం వహిస్తున్న వైసీపి ప్రభుత్వం గురించి ఆంధ్రా ప్రజలు ఏమనుకోవాలి? అంటే ఆంధ్ర ప్రయోజనాలు, ప్రజల కంటే వైసీపి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నట్లే కదా?అయినా వచ్చే ఎన్నికలలో 175/25 సీట్లు తమకే ఇచ్చి గెలిపించాలని వైసీపి ఎలా కోరుకొంటోంది?
తెలంగాణ కోసం కేసీఆర్ గెలవడం చాలా మంచిదే అవసరమే. కానీ అదే ఆంధ్రప్రదేశ్ పాలిట శాపంగా మారుతుండటమే చాలా బాధాకరం.





