మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామనుకొన్న బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయింది. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి హ్యాట్రిక్ కొడతారనుకొన్న కేసీఆర్ ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్ష బెంచీలలో కూర్చోబోతున్నారు.
కేసీఆర్ ఓటమిని హుందాగానే అంగీకరించారు కానీ ‘నా మాటే శాసనం’ అన్నట్లు వ్యవహరించే ఆయన శాసనసభలో సర్దుకుపోగలరా? ముఖ్యంగా తాను ఎంతగానో అసహ్యించుకొంటున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని శాసనసభలో తమతో ఆడుకొంటే భరించగలరా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజమే! ‘నా మాటే శాసనం’ అన్నట్లు వ్యవహరించే కేసీఆర్ మాటకు శాసనసభలోనే విలువలేకపోవడం భరించడం చాలా కష్టమే!
మంత్రి పదవులు చేపట్టబోతున్న పలువురు కాంగ్రెస్ నేతలకి పరిపాలనా అనుభవం ఉన్నప్పటికీ, కేసీఆర్ ముందు వారందరూ దిగదుడుపే అని చెప్పక తప్పదు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్య, వైద్యం, విద్యుత్ తదితర రంగాలకు సంబందించి ఆయనకున్న అవగాహన అసమాన్యమైనది. రాష్ట్రంలో ఏ నది, ఏ కాలువ ఎక్కడ నుంచి ఎటువైపు పారుతోంది?వంటి విషయాలను కూడా ఆయనకు కంఠతా వచ్చు. ప్రతీ విషయాన్ని గణాంకాలతో సహా వివరించగల సమర్దులు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా శాసనసభలో ఆయనను ఎదుర్కోగలవారు లేరనే చెప్పవచ్చు.
అలాగే మాజీమంత్రులు కేటీఆర్, హరీష్ రావు వంటి పలువురికీ వారివారి శాఖలకు సంబందించి ప్రతీ విషయంపై పూర్తి అవగాహన, మంచి సాధికారత ఉంది. కనుక వారితో పోలిస్తే కాంగ్రెస్ మంత్రులెవరికీ అంత అవగాహన లేదనేది వాస్తవమని అందరికీ తెలుసు.
కనుక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రులే ఎక్కువ హోమ్ వర్క్ చేసి శాసనసభకు రావలసి ఉంటుంది. కాదని కేసీఆర్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆటాడుకొందామని వస్తే వారే నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంటుంది.
తెలంగాణ అభివృద్ధిలో చాలా కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే మాజీ పరిశ్రమలు, ఐటి, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అని నిసందేహంగా చెప్పవచ్చు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనలాగ దేశవిదేశాలకు వెళ్ళి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలను ఎవరు సాధించుకు రాగలరో చూడాలి. లేకుంటే తెలంగాణ మంత్రుల నోట కూడా ఏపీ మంత్రుల్లా కోడి, గుడ్డు, ఆమ్లెట్ అంటూ కధలు వినపడవచ్చు.




