తెలంగాణ రాజకీయాలను కంటిచూపుతో శాశిస్తూ జాతీయ రాజకీయాలలో కూడా చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ తెలంగాణ శాసనసభ ఎన్నికలలో దూసుకుపోతున్నట్లయితే ఎవరూ ఆశ్చర్యపోయి ఉండేవారు కారు. ఈ ఎన్నికల ఫలితాలపై పెద్దగా ఆసక్తి చూపి ఉండేవారు కారేమో? కానీ ఈసారి ఆయన తన తెలంగాణ అడ్డాలోనే ఎదురీదుతుండటంతో ఏపీ, తెలంగాణలతో సహా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఈరోజు వెలువడబోతున్న ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ జోస్యం నిజమయ్యేలా ఉందనిపిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి వెంకట రమణారెడ్డి ఆధిక్యంలో సాగుతుండటం కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే గజ్వేల్లో కేసీఆర్, కొడంగల్లో రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మిజోరాం శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడిని సాంకేతిక కారణాల వలన కేంద్ర ఎన్నికల కమీషన్ రేపటికి (డిసెంబర్ 4)కి వాయిదా వేసింది.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ రాష్ట్రాలలో బీజేపీ ఆధిక్యతలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పాలిత ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో రెండు పార్టీలు పోటాపోటీగా సాగుతున్నాయి. అంటే ఈసారి జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ చేతికి మరో రెండు రాష్ట్రాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలను బీజేపీకి కోల్పోయి, కొత్తగా తెలంగాణను గెలుచుకొనే అవకాశం కనిపిస్తోంది.
లోక్సభ ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్స్గా భావించవచ్చు. కనుక హిందీ రాష్ట్రాలలో కీలకమైన ఛత్తీస్ఘడ్, రాజస్థాన్ కాంగ్రెస్ చేతి నుంచి జారిపోయి, మధ్యప్రదేశ్లో మళ్ళీ బీజేపీ వచ్చిన్నట్లయితే, తర్వాత జరుగబోయే లోక్సభ ఎన్నికలలో మళ్ళీ బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు.
మళ్ళీ తెలంగాణ విషయానికి వస్తే బిఆర్ఎస్ పార్టీ సొంత మెజారిటీతో గెలిస్తే ఆ రాష్ట్రం యధాతధంగా సాగిపోతుంది. అయితే కేసీఆర్ గెలిచినా ఓడినా మోడీకి దగ్గరయ్యేందుకు గట్టిగా ప్రయత్నించడం ఖాయమేనని భావించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయినా, మరో 5 ఏళ్లపాటు మోడీతో యుద్ధం కొనసాగిస్తే ఆయన కుటుంబం, ఆయన ప్రభుత్వమే నష్టపోతుంది.
ఒకవేళ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతే అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కూతురు కవితకు ఈడీ నుంచి సమస్యలు మొదలవుతాయి. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టబోయే కేసులు, ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టమవుతుంది కనుక.




