ఇటీవల కాలంలో రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తిగత వ్యాపార లావాదేవీలు, వారి పొలిటికల్ కెరీర్ పాలిట శాపంగా మారుతున్న విషయం తెలిసిందే. దివాకర్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటన టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలపై విమర్శలు చేసే అవకాశాన్ని ఇచ్చి, ఒక రకంగా అధికార ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని కల్పించినట్లయ్యింది. అయితే ప్రతిపక్షం డొల్లతనంతో అధికార ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా, తేలికగా బయటపడింది… అది వేరే విషయం..!
అలాగే విజయవాడ ఎంపీ కేశినేని నాని నిర్వహిస్తున్న కేశినేని ట్రావెల్స్ పై ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు, అభియోగాలు వచ్చిన విషయం తెలిసిందే. తమ ట్రావెల్స్ కు కేశినేని నాని చుక్కలు చూపించాడని, అసలు పన్నులు కట్టడని… ఇలా అనేక ఆరోపణలు చేస్తూ ఆరంజ్ ట్రావెల్స్ అధినేత నానిపై విరుచుకుపడగా, విషయం కాస్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరుకుంది. దీంతో నానిని పిలిపించి ఓ చిన్న సైజు క్లాస్ తీసుకున్నట్లుగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
బహుశా దీని పర్యవసానమో లేక ఇక బస్సుల ద్వారా సంపాదించాల్సిన ఆవశ్యకత లేదనుకున్నారో ఏమో గానీ, కేశినేని ట్రావెల్స్ ను మూసివేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని కేశినేని నానియే అధికారికంగా ప్రకటించారు. తన వలన పార్టీకి చెడ్డ పేరు వస్తోందని, కనుక ఇక నుండి ట్రావెల్స్ వ్యాపారం నుండి తాను తప్పుకోదలుచుకున్నానని చెప్తూ అధికారిక ప్రకటన చేసారు. ఆర్టీఏ అధికారులతో తలెత్తిన గొడవలతోనే కేశినేని నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.



